చంద్రబాబు శకుని కుట్రలు

()హోదాపై చర్చకు భయపడుతున్న బాబు
()ప్రతిపక్ష సభ్యులను రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు
()వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలపై మార్షల్స్ దాడి
()ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించిన వైయస్సార్సీపీ 
()హోదాపై గొంతెత్తి నినదించిన ప్రజల పార్టీ

హైదరాబాద్ః రెండో రోజు ప్రత్యేకహోదా అంశంపై ప్రతిపక్ష సభ్యులు సభను స్తంభింపజేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు సర్కార్ పై వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. హోదాపై చర్చ జరపమంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.  మార్షల్స్ ను మోహరించి సభను నడపడం సిగ్గుచేటని అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  

శ‌కుని క‌న్న పెద్ద కుట్ర‌లు ప‌న్నుతున్న బాబు
వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే నారాయ‌ణ‌స్వామి
 ఏపీ సీఎం చంద్ర‌బాబు మైండ్‌సెట్ ప్రజ‌లంద‌రికీ తెలుస‌ని, త‌న ఎదుగుద‌ల కోసం శ‌కుని క‌న్న పెద్ద కుట్ర‌లు ప‌న్నుతార‌ని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే నారాయ‌ణ‌స్వామి అన్నారు. ప్ర‌జ‌లంద‌రు ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతుంటే చంద్ర‌బాబు ప్యాకేజీ అనడంలో అంత‌ర్యం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదా వ‌స్తే రాష్ట్రానికి ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయ‌ని, నిరుద్యోగ స‌మ‌స్య పూర్తిగా తొల‌గిపోతుంద‌ని వైయ‌స్సార్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌ ప‌దేప‌దే చెబుతూ రాష్ట్రాభివృధ్ధి కోసం పాటు ప‌డుతున్నార‌ని, బాబుకు జీవితాంతం డ‌బ్బును సంపాదించాల‌న్న ఆలోచ‌నే త‌ప్ప‌... రాష్ట్రాభివృద్ధిపై ఏమాత్రం చిత్త‌శుద్ధి లేద‌ని మండిప‌డ్డారు.  

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని స్పీక‌ర్‌కు తెలియ‌జేస్తున్నాం
వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వ‌ర్‌రెడ్డి
హైద‌రాబాద్‌(అసెంబ్లీ మీడియా పాయింట్‌):  ప్ర‌త్యేక హోదా విష‌యమై రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని, టీడీపీ ప్ర‌భుత్వం అన్యాయంగా, అక్ర‌మంగా రాష్ట్ర ప్ర‌జ‌ల భ‌విష్య‌త్‌తో చ‌ల‌గాటం ఆడుతోంద‌ని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్ రెడ్డి అన్నారు. ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని స్పీక‌ర్ ఎదుట వైయ‌స్సార్‌సీపీ శాస‌న‌స‌భ్యులు వ్య‌క్తం చేశార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌జాభిప్రాయం మేర‌కే తాము నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌ని విశ్వేశ్వ‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అర్థరాత్రి ప్యాకేజీని స్వాగతించడమేంటని, ఇదేమైనా చంద్రబాబు ఇంట్లో పెళ్లి విషయమా అని ప్రశ్నించారు. 

ప్ర‌త్యేక హోదాతోనే రాష్ట్ర భ‌విష్య‌త్‌
వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే ర‌క్ష‌ణ నిధి
రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాల‌ని వైయ‌స్సార్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఢిల్లీలో ధ‌ర్నా, రాష్ట్రంలో యువ‌భేరీలు నిర్వ‌హించార‌ని, నిరవధిక నిరాహార దీక్ష సహా ఎన్నో పోరాటాలు చేస్తున్నారని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే ర‌క్ష‌ణ‌నిధి తెలిపారు. రాష్ట్ర విద్యార్థుల భ‌విష్య‌త్ పూర్తిగా ప్ర‌త్యేక హోదాతోనే ముడిప‌డి ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. నిరుద్యోగ స‌మ‌స్య పోవాలంటే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాల‌ని లేనిప‌క్షంలో రాష్ట్రం ఎంతో న‌ష్ట‌పోతుంద‌న్నారు. కేంద్ర‌ప్ర‌భుత్వంపై టీడీపీ ఎందుకు ఒత్తిడి తీసుకురావ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. హోదాపై చర్చ అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. 

ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగానే స్పీక‌ర్ పోడియం ముట్ట‌డి
వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే సునీల్‌ కుమార్
హైద‌రాబాద్‌(అసెంబ్లీ మీడియా పాయింట్‌):  ప్ర‌త్యేక హోదా కావాల‌న్న ల‌క్ష్యంతోనే వైయ‌స్సార్‌సీపీ శాస‌న‌స‌భ్యులు స్పీక‌ర్ పోడియంను ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ముట్ట‌డించామ‌ని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే సునీల్ అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల అభిప్రాయం స్పీక‌ర్ తెలియ‌జేయాల్సిన బాధ్య‌త ప్ర‌తిప‌క్ష పార్టీగా మాపై ఉంది. శాస‌న‌మండ‌లిలో  చంద్రబాబు ఏ విష‌యంలో రాజీ ప‌డ‌డ‌ని తెలియ‌జేశార‌ని, మ‌రి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంతో ఎందుకు రాజీ ప‌డుతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రు ప్ర‌త్యేక హోదా కోసం ఎదురు చూస్తున్నారని, దానిపై చర్చకు జరపాలని డిమాండ్ చేశారు.  

Back to Top