అన్నదాతను రోడ్డున పడేస్తున్న ఏపీ సర్కార్‌

  • వ్యవసాయం శుద్ధదండగ అనే ఆలోచనలో చంద్రబాబు
  • మే 1, 2 తేదీకి వైయస్‌ జగన్‌ రైతు దీక్ష వాయిదా
  • రైతులారా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు
  • ప్రభుత్వం మెడలు వంచైనా మద్దతు ధరను పొందుదాం
  • వైయస్ జగన్ రైతు దీక్షను విజయవంతం చేద్దాం
  • వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్‌: వ్యవసాయం శుద్ధ దండగ అనే ఆలోచనను చంద్రబాబు నాయుడు సార్థకత చేసుకుంటున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్య నారాయణ విమర్శించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా చెల్లించకుండా అన్నదాతను రోడ్డున పడేస్తున్నాడని బొత్స మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ఎన్నికల సమయంలో రైతులకు రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం.. పంటలకు గిట్టుబాటుధర రానప్పుడు ప్రభుత్వమే మద్దతు ధరను కల్పిస్తుందని చంద్రబాబు ప్రగల్భాలు పలికారన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఆ స్థిరీకరణ నిధి కనుచూపుమెరలో కూడా కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందన్నారు. మిర్చి, సుబాబుల్, పసుపు పండించే రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. కందులు, టమాట, మామిడి పండించే రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీసినా చలనం లేదన్నారు. మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేస్తాం.. సీసీఐ ద్వారా కొంటామని చంద్రబాబు ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నాడని మండిపడ్డారు. 

ప్రతిపక్షం పోరాటం చేసినా ప్రభుత్వంలో చలనం లేదు
ప్రభుత్వ మెడలు వంచైనా రైతు పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని గుంటూరు వేదికగా ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుదీక్ష చేయనున్నారని బొత్స స్పష్టం చేశారు. ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించాల్సిన వైయస్‌ జగన్‌ దీక్ష వాయిదా పడిందన్నారు. మే 1, 2 తేదీలకు మార్చడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతోనే వైయస్‌ జగన్‌ దీక్ష చేస్తున్నారన్నారు. రైతు సోదరులంతా దీక్షకు మద్దతు పలికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతును మోసం చేస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. రైతుల తరపున వైయస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు.  పట్టెడన్నం పెట్టేవాడిగా రైతు ఉండాలి కానీ, చెయ్యిచాచేవాడిలా ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే వైయస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. 

టీడీపీ నేతలకేనా మద్దతు ధర
నూటికి 80 శాతం మంది రైతులు దళారులకు పంటను అమ్ముకొని మోసపోతున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు. అయినా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. క్వింటాలుకు రూ. 1500 ఇస్తామని చెప్పి సర్టిఫికేట్లు అంటూ తిరకాసు పెడుతున్నారు. అన్నీ ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుడై ఉంటేనే ఆ ధర కల్పిస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రత్తి రైతుల విషయంలో కూడా ప్రభుత్వం ఇదే విధంగా మోసం చేసిందన్నారు. సంబంధిత మంత్రి అనుచరులు, టీడీపీ నాయకులు, కంపెనీల యాజమాన్యాలు రైతుకు మద్దతు ధర ఇవ్వకుండా దోచుకుతిన్నారని ఆరోపించారు. ప్రత్తి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే 26 మంది దోషులుగా తేలిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఆ ప్రభుత్వాలు చొరవ చూపి ఇతర రాష్ట్రాలకు పంటలను పంపించి రైతులను ఆదుకోవడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ విధంగా మోసం చేస్తే రైతులు వారి ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. రుణమాఫీ విషయంలో కూడా ఇదే విధంగా బాబు మోసం చేశారని బొత్స ధ్వజమెత్తారు. గత మూడు సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంటే రాజకీయ ఉద్దేశ్యాలతో ప్రభుత్వం తన పబ్బం గడుపుకోవడానికి పయత్నం చేస్తుందన్నారు. ప్రభుత్వ మెడలు వంచైనా మద్దతు ధర కల్పించుకుందామని రైతులకు సూచించారు. 
Back to Top