పరిపాలనను గాలికొదిలేసిన చంద్రబాబు

బాబు తన అభివృద్ధి మాత్రమే చూసుకుంటున్నారు
ప్రజల తరపున ప్రశ్నించిన ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు
ప్రభుత్వ దోపిడీని ప్రజలు గమనిస్తున్నారు
వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు
లోకేష్ ఎంతమంది పిల్లల్ని కన్నారో బాబు చెప్పాలిః కొలగట్ల

హైదరాబాద్ః చంద్రబాబు పరిపాలన గాలికొదిలేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచన చేయకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.  ప్రతిపక్ష వైఎస్సార్సీపీని సభలో ప్రశ్నించకుండా చేసిన టీడీపీ తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలు టీడీపీపై విసిగివేసారి పోయారని కొలగట్ల పేర్కొన్నారు. శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కడం రాష్ట్ర ప్రజల గొంతునొక్కడమేనని అన్నారు. ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తుంటే ముఖ్యమంత్రి, ఆయన సహచరులు సహించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇసుకలో ప్రభుత్వం కోట్లాది రూపాయలను దోచుకుందని కొలగట్ల తెలిపారు. అంతా దోచుకున్న తర్వాత ఇసుక విధానాన్ని కష్టతరం చేస్తున్నామని ప్రజలకు చూపించడానికి ...ఎర్రచందనం స్మగ్లర్ ల మీద పెట్టిన కేసులే పెడతామని బాబు చెబుతున్నారని కొలగట్ల విమర్శించారు. మీ అవినీతి దందాను అడ్డగించిన విలేకరులపైనా, ప్రజాప్రతినిధులపైనా, అధికారులపైనా దౌర్జన్యాలు జరుగుతుంటే..మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కొలగట్ల బాబును నిలదీశారు.  

రాష్ట్రంలో మండుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చాల్సిందిపోయి ...నీటిని వృథా చేయొద్దు అంటూ ఓ ప్రకటన చేసి బాబు చేతులు దులుపుకోవడం దుర్మార్గమన్నారు.  తాగునీటి సమస్యను అధిగమించే ప్రయత్నం చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆర్భాటంగా ప్రారంభించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి రాష్ట్రంలో ఎక్కడైనా అమలవుతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  రాష్ట్ర రెవెన్యూ లోటు రూ. 2500 కోట్లు భర్తీ చేయమని ఫైలు పంపిస్తే ...కేవలం రూ. 500 కోట్లు మాత్రమే విడుదల చేసి కేంద్రం చేతులు దులుపుకుందన్నారు. కేంద్రం రాష్ట్రానికి నిధులివ్వకపోవడం అన్యాయమని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్నినిలదీయకపోవడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యంగా భావిస్తున్నామన్నారు. బాబుకున్న లొసుగుల వల్లే కేంద్రాన్ని ఏమీ అడిగే పరిస్థితిలో లేరని యావత్ ప్రజానీకం గమనిస్తుందన్నారు. 

చంద్రబాబు తన అభివృద్ధిని మాత్రమే చూసుకుంటూ, రాష్ట్రంలో దొరికింది దొరికినట్లు దోచుకుంటున్నారు తప్పితే..నిజమైన ప్రజాసంక్షేమం కోసం ఎక్కడా ప్రయత్నం చేయడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో అంతా నేనే ఖర్చుపెట్టుకుంటాను, మీరు భయపడొద్దు.  నీను చూసుకుంటానని  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు  బాబు చెబుతున్నారంటే..ఈప్రభుత్వం ఆర్థికంగా ఏవిధంగా దోచుకుంటుందో  అర్థమవుతోందన్నారు. ఎన్ని వేల రూపాయలు ఇచ్చినా ప్రజలు నమ్మరని, బాబు చేసిన వాగ్దానాలు చూసి విసిగిపోయారని కొలగట్ల అన్నారు. అధికారపార్టీ నేతలు ఏవిధంగా దోచుకుంటున్నారు, దాటుకుంటున్నారో ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని, వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ ఏ కష్టమొచ్చినా, అవసరం వచ్చినా వైఎస్సార్సీపీ అడంగా ఉందని,  వైఎస్ జగన్ దిక్సూచిగా కనిపిస్తున్నారని కొలగట్ల స్పష్టం చేశారు.  

గృహనిర్మాణంలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం తీసుకొస్తానన్న బాబు వ్యాఖ్యలపై కొలగట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు  దోచిపెట్టేందుకే బాబు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలను అదుపు చేయడంలో బాబు ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ధరలను కట్టడిచేయలేక అసందర్భమైన మాటలు మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఫైరయ్యారు.  రాష్ట్రంలో జనాభా తగ్గిపోతోంది, పిల్లలను కనండి అని మాట్లాడుతున్న చంద్రబాబుకు కొలగట్ల చురక అంటించారు.  బాబు మీ పుత్రుడు లోకేష్ ఎంతమంది పిల్లల్ని కన్నారో బహిరంగంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బాబు మీ మాట విని కుటుంబ నియంత్రణ పక్కనబెట్టి ఎక్కువ పిల్లల్ని కంటే... వారి పోషకాహారనికి ప్రభుత్వం మార్గం చూపుతుందా అని ప్రశ్నించారు. 
Back to Top