ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న ఆ ముగ్గురు

  • రాజ్యాంగ విలువలను కాపాడడంలో గవర్నర్‌, సీఎం, స్పీకర్ లు విఫలం
  • ఫిరాయింపుదారులను మంత్రులను చేయడం అనైతికం
  • రాష్ట్రపతి, జాతీయ పార్టీ నేతలను కలవనున్న వైయస్‌ జగన్‌
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు
హైదరాబాద్‌: రాజ్యాంగ విలువలను కాపాడడంలో గవర్నర్, ముఖ్యమంత్రి, స్పీకర్‌లు విఫలమయ్యారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. భారతదేశంలో 70 ఏళ్లుగా ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామ్య విధానాలను, రాజ్యాంగబద్ధమైన సాంప్రదాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పాతరేస్తుంటే గవర్నర్‌ దగ్గరుండి రాజముద్రలు కొడుతున్నారని ధర్మాన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజ్యాంగమే అమలులో లేదని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కేటాయించడంపై ధర్మాన ఫైరయ్యారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ధర్మాన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని ప్రజలు అసహ్యించుకునే విధంగా చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నాడని విమర్శించారు. దీన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ మొండిపోకడకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు రాష్ట్ర ప్రజల తరుపున నిలబడేందుకు వైయస్‌ఆర్‌సీపీ నిర్ణయించుకుందని పేర్కొన్నారు. 

వేటు వేయాల్సిన గవర్నరే ప్రమాణస్వీకారం చేయించారు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే వారిపై చర్యలు తీసుకోవాల్సిన గవర్నర్‌ దగ్గరుండి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడం దుర్మార్గమని ధర్మాన మండిపడ్డారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని పార్టీ ఫిర్యాదులు చేసినా అటు స్పీకర్, ఇటు గవర్నర్‌ పట్టించుకోలేదన్నారు. ఉన్న అధికారాలను పక్కనబెట్టి చట్టాలకు వ్యతిరేకంగా రాజముద్రలు గుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు బలం చేకూర్చే సాంప్రదాయాలను కాపాడాలనే భావన లేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి ఫిరాయింపుదారుల్లో నలుగురికి మంత్రి పదవులు కేటాయించి గవర్నర్‌కు రికమండ్‌ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన పెద్దమనుషులే దగ్గరుండి కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

మోడీ ఏం చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంటే ప్రధాని నరేంద్రమోడీ ఏం చేస్తున్నారని ధర్మాన ప్రశ్నించారు. ఇంతఘోరమైన చర్యలు నిలుపుచేసే ప్రయత్నం చేయరా అని నిలదీశారు. ఫిరాయింపు దారులపై చర్యలు తీసుకునేందుకు,  ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రపతిని కలవనుందన్నారు. అంతే కాకుండా దేశంలో ఉన్న రాజకీయ పార్టీల నేతలను అందరిని కలిసి ఫిరాయింపులనేది లేకుండా చేయాలని, అలాంటి పార్టీలను రద్దు చేసే విధంగా కొత్త చట్టాలను తేవాలని కోరనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో మూడు రోజుల పాటు ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నట్లు వివరించారు. ఒక ప్రాంతీయ పార్టీగా ఫిరాయింపులను నిరోధించడానికి అన్ని పార్టీల మద్దతను కూడగట్టుకుంటామన్నారు. 


Back to Top