కేంద్రంతో చంద్రబాబు కాళ్లబేరం

()ఓటుకు కోట్లు కేసు కోసం కేంద్రంతో రాజీ
() ఐదు కోట్లమంది ఆంధ్రుల భవిష్యత్తు తాకట్టు
() చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యేలు

అసెంబ్లీ మీడియా పాయింట్ః ఏపీ ప్రజలకు సంజీవని లాంటి ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టుపెట్టిన చంద్రబాబు సర్కార్ పై ప్రతిపక్ష వైయస్సార్సీపీ భగ్గుమంది. రాష్ట్రప్రజల భవిష్యత్తును చంద్రబాబు సర్వనాశనం చేశాడని ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ...ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. 

ప్ర‌త్యేక హోదాకు మించిది ఏమీలేదు
వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస్‌రెడ్డి
అసెంబ్లీలో చ‌ర్చించ‌డానికి ప్ర‌త్యేక హోదాకు మించిన అంశం మ‌రేదీ లేద‌ని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస్ రెడ్డి అన్నారు. చంద్ర‌బాబు ఓటుకు కోట్లు కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్ట‌డం స‌రికాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌త్యేక హోదాకు స‌రిప‌డ నిధులు ఇస్తామంటున్న కేంద్రం... ప్ర‌త్యేక హోదా వ‌స్తే ఏపీకి సుమారు రూ. 10ల‌క్ష‌ల కోట్ల అభివృద్ధి జ‌రుగుతుంద‌ని, అంత మొత్తం కేంద్రం చెల్లిస్తుందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. పిల్ల‌ల భవిష్య‌త్ స‌క్ర‌మంగా ఉండాలంటే కచ్చితంగా ప్ర‌త్యేక హోదా కావాల్సిందేనన్నారు. వెయ్యి కోట్ల‌తో రాజ‌ధాని ఎలా నిర్మిస్తారని నిలదీశారు. ప్ర‌జ‌లే దేవుళ్లు వారి వ‌ద్దే ఉంటాం... వారిని క‌లుపుకొని పోరాటాలు చేస్తాం... ప్ర‌త్యేక హోదా సాధిస్తామని గోపిరెడ్డి స్పష్టం చేశారు.

ఐదు కోట్ల ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు తాక‌ట్టు
వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి 
బాబు ఓటుకు కోట్లు కేసునుంచి బ‌య‌ట ప‌డ‌డానికి ఐదు కోట్ల మంది భవిష్య‌త్తును ప‌ణంగా పెడుతున్నార‌ని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే, విప్  పి. రామ‌కృష్ణారెడ్డి మండిపడ్డారు.  ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అని పేర్కొన్నారు. వైయ‌స్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చిన బంద్‌కు అంద‌రు స‌హక‌రించాల‌ని కోరారు. ప్ర‌త్యేక హోదా కోసం నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ఈ బంద్‌నుఅన్ని వామ‌ప‌క్ష పార్టీల‌తో క‌లిసి భారీస్థాయిలో నిర్వ‌హిస్తామ‌న్నారు. 

బాబు సీఎం ప‌ద‌వికి అన‌ర్హుడు
వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న‌
ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను ఢిల్లీలో తాక‌ట్టు పెట్టి రోజుకో మాట మాట్లాడుతున్న చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి అర్హుడు కాద‌ని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న అన్నారు.  ప్ర‌త్యేక హోదా కోసం ఇటు ప్ర‌తిప‌క్షం... అటు ప్ర‌జ‌లు పోరాడుతున్నా చంద్ర‌బాబుకు చీమ‌కుట్టిన‌ట్లు కూడా లేద‌ని విమ‌ర్శించారు. ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహన్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఎన్నో పోరాటాలు చేస్తున్నామ‌ని ఉప్పులేటి క‌ల్ప‌న తెలిపారు. ప్ర‌త్యేక హోదా కోసం ఈ నెల 10 నిర్వ‌హించ త‌ల‌పెట్టిన రాష్ట్ర‌వ్యాప్త బంద్‌కు ప్ర‌జ‌లంద‌రు స‌హ‌క‌రించి విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. 

అర్థ‌రాత్రి స్వాగ‌తం ఎందుకు బాబు..?
వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్ రెడ్డి
అర్థ‌రాత్రి పూట సీఎం కేంద్ర ప్ర‌భుత్వ ప్యాకేజీని స్వాగ‌తించ‌డం దేనికోసమని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వ‌ర్ రెడ్డి ప్రశ్నించారు. ప్ర‌త్యేక హోదా కోసం అసెంబ్లీలో రెండుసార్లు ఏక‌గ్రీవ తీర్మానం జ‌రిగిన త‌ర్వాత...సభలో చ‌ర్చించ‌కుండా చంద్ర‌బాబు ప్యాకేజీని ఎలా స్వాగ‌తిస్తార‌ని ఆయ‌న నిలదీశారు.  చంద్ర‌బాబు ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక‌పోతున్నార‌న్నారు. రాష్ట్ర‌ ప్ర‌జ‌లంద‌రు ప్ర‌త్యేక హోదా గురించి డిమాండ్ చేస్తున్నా బాబు స‌ర్కార్ మాత్రం నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హారిస్తోందన్నారు. ప్ర‌త్యేక హోదాకు ప్యాకేజీ ఏమాత్రం స‌మానం కాద‌న్నారు. ఓటుకు కోట్లు కేసు భ‌యం వ‌ల్లే బాబు రాజీప‌డి కేంద్ర‌ప్ర‌భుత్వంతో కాళ్ల‌బేరం పెట్టుకుంటున్నార‌ని ధ్వ‌జమెత్తారు. రాష్ట్ర ప్ర‌జ‌ల భవిష్య‌త్ క‌న్నా చంద్ర‌బాబుకు త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 

తాజా వీడియోలు

Back to Top