విభజన లేఖ ఇచ్చిన ప్రజాద్రోహి చంద్రబాబు

తిరుపతి, 29 ఆగస్టు 2013 :

అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించేందుకు కేంద్రానికి లేఖ ఇచ్చి తెలుగువారికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ద్రోహం చేశారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నిప్పులు చెరిగారు. ప్రధానికి లేఖ పేరుతో ప్రజలను మరోసారి వంచించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. నయవంచన రాజకీయాలకు చంద్రబాబు చిరునామా అని కరుణాకరరెడ్డి దుమ్మెత్తిపోశారు. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి దీక్షకు రాష్ట్ర ప్రజలు బాసటగా నిలుస్తున్నారని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ప్రజలంతా సమన్యాయం కావాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.

జైలు నిర్బంధంలో ఉండి కూడా శ్రీ జగన్మోహన్‌రెడ్డి సమన్యాయం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి చరిత్రలో మహోన్నత వ్యక్తిగా నిలిచిపోతారని అంతకు ముందు కరుణాకరరెడ్డి అభివర్ణించారు. భారతదేశ రాజకీయాల్లోనే సమన్యాయం, సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమాలను తీవ్రతరం చేస్తున్నది ఒక వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మాత్రమే‌ అని భూమన అన్నారు. ఏడు కోట్ల మంది ప్రజలు జగనన్న వెంట ఉన్నారని పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాల కోసం విభజన ప్రకటన చేసిన సోనియా గాంధీ వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Back to Top