జగన్‌ బెయిల్‌పై చంద్రబాబు కుటిల కుట్రలు

తాడేపల్లిగూడెం (ప.గో.జిల్లా) :

పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా చేసేందుకు‌ చంద్రబాబు కుటిల కుట్రలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ‌డిమాండ్‌తొ నిర్వహించిన పాదయాత్రను తాళ్లముదునూరుపాడులో ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ.. శ్రీ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై బయటకు వస్తే టిడిపికి నామరూపాలు లేకుండా పోతాయనే దడతో బెయిల్‌ను అడ్డుకోవడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతోందని ఒక్క వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు‌ మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ బీజం వేశారని విమర్శిస్తున్నారని, ఆయన బతికుంటే‌ అసలు రాజకీయ సంక్షోభమే వచ్చేది కాదన్నారు.

తాడేపల్లిగూడెం నియోజకవర్గం సమన్వయకర్త తోట గోపి మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి నుంచి సామాన్య కార్యకర్త వరకు పాల్గొంటున్నారన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేయడం ఆయన రెండు నాల్కల ధోరణికి నిదర్శనమన్నారు. తాళ్లముదునూరుపాడులో మొదలైన పాదయాత్ర యాగర్లపల్లి వరకు సాగింది. పార్టీ నాయకులు యెగ్గిన నాగబాబు, బొడ్డు సాయిబాబా. గుండుమోగుల బలుసులు, వీర్ల గోవిందు, బాలం కృష్ణ, దింటకుర్తి లీలావతి, ముద్రగడ లలితకుమారి, పైడి వరలక్ష్మి, ఎస్‌ఎం సుభానీ, దాగారపు నాగు తదితరులు పాల్గొన్నారు.

Back to Top