విభజన లేఖను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి

తిరుపతి :

రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చినట్లు ముక్కలు చేసుకోండి అంటూ కేంద్రానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖను తక్షణమే వెనక్కి తీసుకోవాలని నెల్లూరు ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వినాయక చవితి సందర్భంగా తిరుపతిలో పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి 560 వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మేకపాటి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ, విభజనపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా చంద్రబాబు బస్సు యాత్ర చేయడం హాస్యాస్పదం అన్నారు. ఒక పక్క విభజనకు అనుకూలం అని చెబుతూనే పార్లమెంటులో తమ పార్టీ ఎంపిలతో ధర్నాలు చేయిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెబుతూనే దానిని పోగొట్టుకోవడానికి బాబు సిద్ధమవుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకుందని, చంద్రబాబు కూడా స్పష్టత ఇవ్వాలని ఎం.పి. మేకపాటి డిమాండ్ చేశారు.‌ శ్రీమతి షర్మిల చేస్తున్న సమైక్య శంఖారావం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.

రాష్ట్రానికి కాంగ్రెస్, టిడిపి అనే రెండు విఘ్నాలున్నాయని, ఇవి 2014తో తొలగిపోతాయన్నారు. సమైక్య రాష్ట్రానికి శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు రోజా అన్నారు.

సిడబ్ల్యుసి నిర్ణయం అంటే శాసనం కాదు :
నెల్లూరు : రాష్ట్ర విభజన విషయంలో సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయం శాసనం కాదని మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు విఆర్‌సి సెంటర్‌లో రిలే దీక్షలు చేస్తున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ అధ్యాపకులకు శనివారం ఆయన సంఘీభావం ప్రకటించారు. సీమాంధ్రుల్లో పెల్లుబుకుతున్న ఉద్యమం, ఆందోళనల వివరాలను నిఘా వర్గాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని చెప్పారు. ఈ సమయంలోనే సీమాంధ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని మేకపాటి అన్నారు.

Back to Top