ఓటుకు నోటు...సిగ్గుచేటు

ఎన్నికల హామీలకు తూట్లు
పోరాటయోధుడిపై విమర్శలతో పబ్బం
అవినీతి సొమ్ముతో నీచ రాజకీయాలు
టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన అవినాష్ రెడ్డి

వైయస్సార్ జిల్లా(పులివెందుల): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో అనైతిక రాజకీయాలు చేస్తున్నారని కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. పులివెందులలోని  క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా...ఇంతవరకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా  వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

అభివృద్ధిని మర్చి... మహానాడులో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలంతా వైయస్ జగన్‌ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలకు ఏకష్టమొచ్చినా వారి గురించి పోరాడే నాయకుడు ఒక్క వైయస్ జగన్‌ మాత్రమేనని అవినాష్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు మాత్రం ప్రజల గురించి ఆలోచించకుండా అవినీతి రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యసభ బరిలో బలం లేకున్నా చంద్రబాబు నాలుగో అభ్యర్థిని దించాలనుకోవడం చంద్రబాబు అనైతికతను తెలియజేస్తోందన్నారు. 

అవినీతి సొమ్ముతో భారీగా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు నాలుగో అభ్యర్థిని నిలబెట్టాలని అనుకుంటున్నారన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా డబ్బులు ఎరచూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు ఏపీలో కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నారని అవినాష్ రెడ్డి మండిపడ్డారు.  ఓటుకు నోటు కేసు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు మరలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు.

చంద్రబాబు ఎమ్మెల్యేలను మభ్యపెట్టగలడేమోగాని ప్రజలను మభ్యపెట్టలేరన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ హామీని ఇంతవరకు చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. బాబు మోసాలపై జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ పోలీస్ స్టేషన్లలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసులు పెడతామన్నారు. అవినాష్ రెడ్డి పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.



Back to Top