ఐపీ పెట్టిన కంపెనీని తీసుకొచ్చి ఉక్కు పరిశ్రమ కడతారా?

దొంగ దీక్షలతో ఇంకా ఎవరిని మభ్యపెడతారు
2014లో పరిశ్రమ రాదని చెబితే.. 2018లో దీక్ష చేస్తారా?
ఇదేనా రాష్ట్ర ప్రయోజనాలపై మీకున్న చిత్తశుద్ధి
ఉక్కు పరిశ్రమ వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే సాధ్యం
వైయస్‌ఆర్‌ సీపీ మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్‌ దొంగ దీక్షలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. 2014లో ఉక్కు పరిశ్రమ నిర్మాణం సాధ్యం కాదని బీజేపీ చెబితే.. 2018లో నిరాహార దీక్ష చేస్తారా అని ప్రశ్నించారు. ఏడు సంవత్సరాలుగా ఎంపీగా కొనసాగుతున్న సీఎం రమేష్‌ విభజన అనంతరం  నాలుగేళ్లలో ఒక్క సారైనా పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారా అని నిలదీశారు. కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌  పార్టీ ఆధ్వర్యంలో  బద్వేల్‌లో మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజద్‌బాషా, రవీంద్రనాథ్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైయస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. చైనాలో ఐపీ పెట్టిన కంపెనీని తీసుకువచ్చి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రత్యేక హోదా, ఉక్కు పరిశ్రమ, విభజన చట్టంలోని అంశాలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. 

రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి పోరాడుదాం.. రాజకీయాలు ఎన్నికల సమయంలో చూసుకుందాం.. హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ సీపీతో కలిసి రావాలని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ నెల్లూరులో జరిగిన సభలో ప్రభుత్వాన్ని కోరారన్నారు. మా ఎంపీలు ఏప్రిల్‌ 6వ తేదీ వరకు ప్రత్యేక హోదా, విభజన అంశాలపై పోరాటం చేస్తారని, కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే వెంటనే రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేస్తారని ఫిబ్రవరిలో ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఎంపీలంతా రాజీనామాలు చేస్తే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని బీజేపీని దోషిగా నిలబెట్టినట్లు అవుతుందని.. కలిసి రండి రాజీనామాలు చేద్దామని వైయస్‌ జగన్‌ కోరినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. 14 నెలల పదవికాలం వదులుకుని ఆమరణ దీక్ష చేస్తే టీడీపీ నేతలు హేళన చేసి మాట్లాడారన్నారు. ఇప్పుడు ఎవరిని మభ్యపెట్టేందుకు సీఎం రమేష్‌ దీక్ష చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

రాజకీయ ప్రయోజనాల కోసం దీక్ష చేస్తున్న సీఎం రమేష్‌ను ఎవరూ సమర్థించడం లేదన్నారు. ఏడు సంవత్సరాలుగా పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఏనాడూ ప్రత్యేక హోదా, ఉక్కు పరిశ్రమ, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. స్థానిక పార్లమెంట్‌ సభ్యుడిగా నాలుగు పర్యాయాలు లోక్‌సభలో విభజన చట్టం హక్కుల గురించి ప్రస్తావించానని, అదే విధంగా అనేక మార్లు కేంద్ర మంత్రులను కలిసి మనవి చేశానన్నారు. రైతులు, ఫాతిమా కాలేజీ అంశంపై మాట్లాడానన్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా ఢిల్లీలో దీక్ష చేయాలని, కడపలో చేస్తే రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేస్తున్నట్లేనన్నారు. నాలుగు సంవత్సరాలు తాత్సారం చేస్తున్న బీజేపీది ఎంత తప్పుందో.. వారితో కలిసి చట్టంలోని అంశాలను సాధించలేకపోయిన టీడీపీది అంతే తప్పు ఉందన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమపై స్పందించకపోతే... ఏపీ స్టీల్స్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వమే.. ఉక్కు పరిశ్రమను నెలకొల్పుతుందని వైయస్‌ జగన్‌ వైయస్‌ఆర్‌ జిల్లా పాదయాత్రలో ప్రకటించారన్నారు. ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతాం.. నిరుద్యోగ సమస్యను తరిమికొడతామని చెప్పారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే ఉక్కు పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందన్నారు. 
Back to Top