రైతుల ఆత్మహత్యలు కనబడడం లేదా బాబు..?

నూజెండ్ల: ప్రజా సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మానాయుడు అన్నారు. మండలంలోని చింతలచెర్వు పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా బొల్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పోలేరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చింతలచెర్వు, మూర్తింజాపురం గ్రామస్థులు నిర్మించిన భారీ విద్యుత్‌ ప్రభలపై ఏర్పాటు చేసిన సభలో బొల్లా మాట్లాడారు. మట్టి, ఇసుక దగ్గర నుంచి అన్నింటినీ దోచుకుంటూ రైతుల రక్తాన్ని పీలుస్తూ రాష్ట్రంలో ప్రజాకంటక ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చినతర్వాత మరోమాట చెప్పడంలో టీడీపీ నాయకులకు మించిన వారు లేరన్నారు. ఆరుగాలం శ్రమించి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంపండించిన పంటలకు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.... ఏపీని సింగపూర్‌కంటే బాగా నిర్మి స్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.

Back to Top