కరువు పట్టని గుడ్డి ప్రభుత్వం

()వ్యవసాయానికి ప్రధాన శత్రువు బాబు
()రైతుల ఆకలి కేకలే వినిపించడం లేదు
()ఆదుకుంటానని చెప్పి అన్నదాతను నట్టేట ముంచాడు
()బాబుపై నిప్పులు చెరిగిన వైయస్సార్సీపీ నేతలు

అనంతపురంః చంద్రబాబుకు రైతుల సమస్యలే పట్టడం లేదని అనంత వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట మహా రైతు ధర్నా జరిగింది. ఈసందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.   

రైతులంతా ఆకలిమంటలతో అలమటిస్తుంటే సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విహారయాత్రలు చేస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ వద్ద వైయస్‌ఆర్‌ సీపీ చేపట్టిన మహాధర్నా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరువు వస్తే రైతులకు, ప్రజలకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌ ఎక్కి ఏరియల్‌ సర్వే అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. జిల్లాలో రైతులు నీరు లేక పంటలు పండగా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంటే టీడీపీ ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. ఎన్నికల్లో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయానికి ప్రధాన శత్రువుగా మారిపోయాడని ఆరోపించారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచాడని ఫైరయ్యారు. కరువుతో రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతు భరోసా కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి ఇంటికి వెళ్లి వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారని స్పష్టం చేశారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ రైతు కుటుంబాలకు వైయస్‌ జగన్‌ ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. పంటలకు నష్టపరిహారం చెల్లించలేని చంద్రబాబు రెయిన్‌ గన్స్‌ అంటూ మరోసారి ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మాయమాటలు చెప్పకుండా రైతులకు చెందాల్సిన ఇన్‌పుట్‌ సబ్సీడీ, ఇన్సూరెన్స్‌తో రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వైయస్‌ జగన్‌ మహాధర్నాను చూసైనా ప్రభుత్వం కళ్తు తెరవాలని హితవు పలికారు. 

రాష్ట్రానికి ఏం చేశారు..!
పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు కరువొచ్చిందని రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నా చంద్రబాబు గుడ్డి ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ విమర్శించారు. వేరుశనగను బతికిస్తాం పంటలు వేసుకోండి అని మోసపూరిత హామీలిచ్చి బాబు రైతాంగాన్ని నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 13 లక్షల ఎకరాలపైగా సాగుచేస్తే ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల ఎకరాలకు రక్షక తడుపులిచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని ఫైరయ్యారు. మిగిలిన రైతులకు నీరెక్కడ అని ప్రశ్నించారు. కంటితుడుపు చర్యగా పైపైన నీళ్లుజల్లి పంటలకు నీళ్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. టీడీపీ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష నేతలు, ప్రజా సంఘాలతో కలిసి పంటల క్షేత్రస్థాయి పరిశీలకు వెళ్ధాం సిద్ధమేనా అని నిలదీశారు. మోసపూరిత హామీలతో ప్రజలను వంచించి సిగ్గులేకుండా అభినందన, సన్మాన సభలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇంకుడు గుంతల స్వామి చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. పంటనష్టంతో కొట్టుమిట్టాడుతున్న రైతాంగాన్ని ఆదుకోకపోతే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

రెండున్నర ఏళ్లలో బాబు పాలనకు చరమగీతం
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వర్షాలు లేక 9 సంవత్సరాలు రైతులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో అదే పరిస్థితి మళ్లీ పునరావృతమైందని వైయస్‌ఆర్‌ సీపీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో వర్షభావ పరిస్థితుల్లో అనంతను ఆదుకుంటానని చెప్పి మూడు రోజులు బాబు తిష్టవేస్తే కురిసే వర్షం కూడా వెనక్కుపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రైతన్నలకు కష్టం వస్తే ఆదుకునే ఏకైక కుటుంబం వైయస్‌ఆర్‌ కుటుంబం అని కొనియాడారు. జిల్లాలో 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. రైతుకు మేలు జరిగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం దయచేసి ఆత్మహత్యలకు పాల్పడవద్దని చెప్పిన వ్యక్తి వైయస్‌ జగన్‌ ఒక్కరేనని స్పష్టం చేశారు. రైతులు కరువుతో అల్లాడుతుంటే ఇన్‌పుట్‌ సబ్సీడీ, ఇన్సూరెన్స్‌ ఇవ్వకుండా ఇదిగో.. అదిగో అంటూ రెండున్నర సంవత్సరాల గడిపిన చంద్రబాబుకు ఇంకో రెండున్నర సంవత్సరాల్లో చరమగీతం పాడడం ఖాయం అని చెప్పారు. రైతు శ్రేయోభిలాషి వైయస్‌ జగన్‌ను రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చేయడం ఖాయమని తేల్చిచెప్పారు. 

బాబు డైరెక్షన్‌.. అధికారుల ఓవరాక్షన్‌
ఆంధ్రరాష్ట్రంలో రైతులకు శాశ్వతంగా ఉపయోగపడే ప్రాజెక్టు ఒక్కటి కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్మించకపోవడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. బాబు బూటకపు హామీలను నమ్మి ప్రజలు అధికారం కట్టబెడితే వాళ్ల కడుపుకొట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని మండిపడ్డారు. ఓనమాలు కూడా రాని వారికి చంద్రబాబు మంత్రి పదవులను కట్టబెట్టారని ఆరోపించారు. ఎప్పుడు నీళ్లు ఇవ్వాల్లో, ఎప్పుడు ఇవ్వకూడదో కూడా రైతులకు తెలియదని ఎద్దేవా చేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన హయాంలో జిల్లా రైతాంగంలో ఆశ చిగురించిందన్నారు. గాలేరు నగరి, హంద్రీనీవా వంటి ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా బతికిన వైయస్‌ఆర్‌ ఆ ప్రాజెక్టులను నిర్మించారన్నారు. జీడిపల్లి జలాశయంలో పుష్కరాలు వచ్చాయంటే అది వైయస్‌ఆర్‌ పుణ్యమేనని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ హయాంలో పంటలకు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకున్నాడని కొనియాడారు. టీడీపీ హయాంలో చంద్రబాబు డైరెక్షన్‌... కలెక్టర్‌ల ఓవర్‌యాక్షన్‌గా మారిందన్నారు. అనంత జిల్లా కలెక్టర్‌ 3 లోల 72 వేల ఎకరాలకు రక్షకతడి ఇచ్చామని గొప్పులు చెప్పుకుంటున్నారని, లక్షల ఎకరాలకు ఒక తడి నీళ్లు ఇవ్వాలంటే 10 టీఎంసీల నీరు కావాలని సూచించారు. గంగా జలాన్ని భూమి నుంచి తీసుకొచ్చారా లేక ఆకాశం నుంచి తీసుకొచ్చారా అని కలెక్టర్‌ను ప్రశ్నించారు. ఎందుకు ప్రజలను మోసపుచ్చే కార్యక్రమాలు చేస్తున్నారని నిలదీశారు. బాబు రెయిన్‌ గన్‌లతో డ్రామా సినిమా చేస్తున్నారని విమర్శించారు. మోసకారి చంద్రబాబు ప్రభుత్వ మెడలు వంచాలంటే అది వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తేని సాధ్యమన్నారు. గోదావరి, కృష్ణ జలాలు దాదాపు 2500 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతుల కలలు సహకారం కావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని స్పష్టం చేశారు. కరువుతో పంటనష్టపోయిన రైతులకు ఎకరాలకు రూ. 20వేలు చెల్లించకపోతే టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తామని హెచ్చరించారు. 

అన్ని వర్గాలను వంచించారు
ఎన్నికల ముందు మోసపూరిత హామీలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబు విదేశాల పేరుతో విమానాల్లో విహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్‌ఆర్‌ సీపీ నేత గురునాథ్‌రెడ్డి అన్నారు. గుంటూరులో అకాల వర్షంతో జనజీవనం స్తంభించిపోతే హెలికాఫ్టర్‌ ఎక్కి ఏరియల్‌ సర్వే చేశారు కానీ భూమిమీద నడిచే పరిస్థితి లేకపోవడం దుర్మార్గమన్నారు. దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పంట నష్టం జరిగితే రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దూ పంట నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పిన ఏకైక వ్యక్తి అని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కరువు తాండవిస్తున్నా రైతులను ఆదుకోవడం చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చలించి వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరుబాట పట్టారని చెప్పారు. ప్రభుత్వ మెడలు వంచి రైతులకు నష్టపరిహారం ఇప్పించేంత వరకు పోరాటం సాగుతుందని హెచ్చరించారు. రైతుల తరుపున పోరాటం చేస్తున్న వైయస్‌ జగన్‌ను సీఎం చేస్తేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. 

Back to Top