బాబు ధర్మపోరాటం రాక్షసుల యాగం లాంటిది

విశాఖపట్నం: చంద్రబాబు ధర్మపోరాటం చేస్తున్నాడంటే.. రాక్షసులు యాగం చేసినట్లేనని, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నానంటే.. సీతమ్మను వెతకడానికి రాముడికి రావణాసురుడు సాయం చేసినట్లేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అనే మాటే వినపడకూడదని ఉద్యమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే ప్రతిపక్ష నేత లేకుండా ఉంటే.. ప్రత్యేక హోదా అనే మాటను చంద్రబాబు అద్హపాతాలానికి తొక్కేవాడన్నారు. నాలుగు సంవత్సరాలుగా నిరంతరం ప్రజలను చైతన్యం చేస్తూ.. హోదా ప్రయోజనాలను వివరిస్తూ... ఏ రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ప్రజలకు తెలియజేస్తూ ప్రజల నాలుకలో హోదా మాటను రామనామజపంలా మార్చిన ఘనత వైయస్‌ జగన్‌దన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం వెంకటేశ్వరస్వామి పాదాల సాక్షిగా ఇదే రోజున చంద్రబాబు 15 సంవత్సరాలు హోదా కావాలని మాట్లాడారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని, తెస్తామని ప్రజల ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు, మోడీ ఇద్దరూ దోషులేనన్నారు. 600ల హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ప్రతి ఇంటికి ఉద్యోగం, అంత వరకు నిరుద్యోగ భృతి, బలహీనవర్గాలకు రూ. 10 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్, కాపులను బీసీలుగా చేర్చుతా.. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తానని భగవంతుడి పాదాల సాక్షిగా ప్రమాణం చేసి తీవ్ర మోసం చేశాడన్నారు. నాలుగేళ్లు ప్రజలకు మోసం చేశానని, ప్రజలకు క్షమాపణ చెప్పి ఉపన్యాసం మొదలు పెట్టాలన్నారు. 
 
Back to Top