హామీలు అమలు చేయకపోవడం మోసం కాదా?




– మోసాలు, అవినీతి, వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు అనుభవం ఉంది
– చంద్రబాబు పాలనలో మనం అభివృద్ధి చెందామా?
– నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు
– ఎలాంటి నాయకుడు కావాలో గుండెలపై చేతులు వేసుకొని ఆలోచించండి
– ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారు
– బీసీలపై నిజమైన ప్రేమ చూపించింది వైయస్‌ఆరే
– పేదరికం నుంచి బయట పడాలంటే పెద్ద పెద్ద చదువులు చదవాలి
– ఎన్ని లక్షలు ఖర్చైనా మీ పిల్లలను చదివించే బాధ్యత నాది
– హాస్టల్‌ ఖర్చులకు ప్రతి విద్యార్థికి రూ.20 వేలు
– పిల్లలను బడికి పంపించినందుకు తల్లులకు ఏటా రూ.15 వేలు

గుంటూరు: ఎన్నిలక సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం మోసం కాదా అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడం, అవినీతికి పాల్పడటం, వెన్నుపోటు పొడవడమే చంద్రబాబుకు ఉన్న అనుభవం అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా గుడిపూడి బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్‌ జగన్‌ పాల్గొని చంద్రబాబు మోసాలను ఎండగట్టారు. మనందరి ప్రభుత్వం వచ్చాక అందరికి తోడుగా ఉంటానని భరోసా కల్పించారు. 

ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం ఆనందంగా ఉంది..
ఈ రోజు గుంటూరు జిల్లాలో పాదయాత్రలో సందర్భంగా బీసీ సోదరులతోనూ, అక్క చెల్లెమ్మలతో ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశాం. మరో సంవత్సరంలో ఎన్నికలు జరుగబోతున్నాయని ఈ పెద్ద మనిషి ఊదరగొడుతున్నారు. ఇలాంటి సమయంలో మనమంతా కూడా గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయాలి. మనకు ఎలాంటి నాయకుడు కావాలని మనమందరం ఆలోచన చేయాలి. ఈ నాలుగేళ్ల పరిపాలన మనమంతా చూశాం కాబట్టి..ఈ పెద్ద మనిషి చంద్రబాబు మాటిమాటికి అభివృద్ధి అంటున్నారు. మనందరికి తెలిసిన అభివృద్ధి ఏంటంటే..నిన్నటి కంటే ఇవాళ బాగుంటే దాన్ని అభివృద్ధి అంటారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను చూశాం. ఇవాళ చంద్రబాబు పాలనను చూసిన తరువాత మనం అభివృద్ధి చెందామా?ఏ ఒ క్కరూ కూడా సంతోషంగా లేరు. 

ఫొటోలకు ఫోజులు 
చంద్రబాబు ఎన్నికల సమయంలో బీసీల గురించి ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలి. ఎన్నికల ప్రణాళిక చంద్రబాబు విడుదల చేశారు. ఇందులో చంద్రబాబు రకరకాలుగా ఫోజులు ఇస్తారు. గౌడ సోదరులు కనిపిస్తే వారి వద్ద ఉన్న తాడు ఈయన మీద వేసుకొని ఫోజు కొడతారు. ఆ పక్కనే బుట్టలు వేస్తున్నారు. వారి పక్కన కూర్చోని బుట్టలు వేస్తున్నట్లు ఫోటోలు దిగారు. చేనేతల ఇళ్లకు పోయి మగ్గం నేస్తున్నట్లు ఫోటోలు దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఫోటోలు, స్టంట్లూ అన్ని బాగున్నాయి. ఎన్నికల ప్రణాళికలో ఏదైతే చెప్పారో అవి చేయకపోవడం మోసం కాదా చంద్రబాబు?

మంచి కన్న చెడే ఎక్కువ..
రాజకీయాల్లో నలబై సంవత్సరాల అనుభవం ఉందని చంద్రబాబు చెబుతుంటారు. ప్రజలను మోసం చేయడంలోనా? వెన్నుపోడవటంలోనా నీ అనుభవం అని అడుగుతున్నాను. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో మంచి కన్న చెడు ఎక్కువగా జరిగింది. ఈ మనిషి చివరకు ఏ స్థాయిలో దిగజారిపోయారంటే..సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చెబితే దాన్ని చేయగలిగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం పరిధిలో లేనివి కూడా టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారు. కురవలు, కురబలను ఎస్టీల్లో చేర్చుతానన్నారు. రజకులను ఎస్సీలుగా చేస్తానని చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇవాళ ఇదే పెద్ద మనిషిని అడిగితే ఆయన ఏమంటారో తెలుసా? ఇది రాష్ట్రం పరిధిలో లేదని, కేంద్రం చేయాల్సి ఉందని చేతులు దులుపుకుంటారు. కేంద్రంపై నేరాన్ని నెట్టడం ఆయన చేతులు కడుక్కోవడం ఒక పద్ధతి ప్రకారం 40 ఏళ్ల అనుభవంతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాలు చాలానే టీడీపీ మేనిఫెస్టోలో కనిపిస్తాయి. 

నాలుగు ఇస్త్రీ పెట్టెలు  ఇస్తే సరిపోతుందా?
ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారు. నాలుగు ఇస్త్రీ పెట్టెలు, నాలుగు కత్తెర్లు ఇస్తే అదే బీసీల మీద ప్రేమ అనుకుంటారు. బీసీలపై నిజంగా ప్రేమ చూపించింది దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరే అని నేను గర్వంగా చెబుతానున. నిజంగా పేదవాళ్లు పేదరికం నుంచి ఎలా బయటకు వస్తారంటే..నాలుగు  ఇస్తీ్ర పెట్టెలు, కత్తెర్లు ఇస్తే పేద రికం నుంచి బయటకు రారు. ఆ కుటుంబం నుంచి డాక్టర్లు, ఇంజినీర్లుగా, కలెక్టర్లుగా బయటకు వస్తే పేదరికం పోతుంది. ఆ చదువులకు అప్పులపాలు కాకుంటే అప్పుడు ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయి. దీన్ని మహానేత గొప్పగా నమ్మారు. పేదవాడు పేదరికంలో ఎందుకు వెళ్తారంటే విద్యా, వైద్యం కోసం అప్పులు చేస్తే అప్పులు చేసినప్పుడే. వడ్డీలకు పరుగెత్తినప్పుడు అప్పులపాలు అవుతారు. ఈ రెండు కారణాలను దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి గొప్పగా చేశారు. నాన్నగారి హాయంలో ఏ పేదవాడు కూడా తన పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించేందుకు ముఖ్యమంత్రిగా వైయస్‌ రాజశేఖరరెడ్డి తోడుగా ఉండి భరోసా కల్పించారు. నాన్నగారి హయాంలో పేదవారు తమ పిల్లలను చదివించేందుకు అవస్థలు పడలేదు. నాన్నగారు చనిపోయిన తరువాత ఇవాళ పరిస్థితి ఏంటీ? మన పిల్లలను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా చదివించే స్థితిలో ఉన్నామా? ఇంజినీరింగ్‌ చదువులుకు ఏడాదికి లక్షలు ఖర్చు అవుతాయి. ప్రభుత్వం మాత్రం ముష్టి వేసినట్లు రూ.35 వేలు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన డబ్బుల కోసం తమ పిల్లలను చదివించేందుకు ఆ పేదవాడు అప్పులు చేయాల్సి వస్తోంది. ఇక్కడికి రాకముందు నెల్లూరు జి ల్లాలో ఒక ఘటన చూశాను. ఓ పేదవాడు తన పిల్లలను చదివించేందుకు ఆరాటపడ్డాడు. ఇంజినీరింగ్‌ చదివించేందుకు మొదటి సంవత్సరం రూ.70 వేలు అప్పు చేశాడు. రెండో ఏడాది మళ్లీ అప్పులు చేస్తూ, వాళ్ల నాన్న బాధ చూడలేక ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న దుస్థితి చూశాను. వారు చెబుతుంటే నా గుండె తల్లడిల్లిపోయింది. నాన్నగారి హయంలో మంచి రోజులు చూశాం. మహానేత చనిపోయాక మళ్లీ పరిస్థితులు మొదటికి వచ్చాయి.

మీ పిల్లలను ఏం చదివిస్తారో మీ ఇష్టం
రేపొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామో చెబుతున్నాను. నాన్నగారు పేదవారి కోసం ఒక  అడుగు ముందుకు వేస్తే..ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో మీ ఇష్టం. ఎన్ని లక్షలు ఖర్చైనా ఫర్వాలేదు..నేను చదివిస్తాను. ఏ తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా నేను తోడుగా ఉంటాను. మన పిల్లలను ఇంజినీరింగ్, డాక్టర్‌గా చదివించాలంటే హాస్టల్‌లో ఉండాలి. వీటి కోసం ఏడాదికి రూ.15 వేలు ఖర్చు అవుతుంది. ఈ డబ్బు కూడా పంపించలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రతి పిల్లాడికి ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ఆ తల్లిదండ్రులకు చెబుతున్నాను. దీని వల్ల ఏ తల్లి తండ్రి అప్పుల పాలు కాకుండా భరోసా ఇస్తున్నాను.


అప్పుడే మన తలరాతలు మారుతాయి..
ఇవాళ మన పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే వారికి పునాదులు ఆ చిట్టి పిల్లలు బడులకు వెళ్లి చక్కగా చదివితేనే మన తలరాతలు మారుతాయి. వీరు బడులకు వెళ్లేందుకు తల్లులు తమ పిల్లలను బడులకు పంపించాలి. నాన్నగారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే..నాన్నగారి కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. పిల్లలను బడికి పంపించినందుకు ఆ తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాను.

అక్కా చెల్లెమ్మలకు భరోసా ఇస్తున్నా..
బీసీల కోసం మనం చేయబోయే అతిపెద్ద కార్యక్రమం ఏంటంటే పింఛన్ల పెంపు. ఈ ప్రభుత్వానికి అవ్వతాతల పింఛన్లు పెంచాలనే ఆలోచన లేదు. కాంట్రాక్టర్లకు మాత్రం చంద్రబాబు రేట్లు బాగా పెంచుతారు. కారణంగా కాంట్రాక్టర్లు బాగా చంద్రబాబుకు లంచాలు ఇస్తారు కాబట్టి వారికి రేట్లు పెంచుతారు. అవ్వతాతల నుంచి చంద్రబాబుకు లంచాలు వెళ్లవు..జన్మభూమి కమిటీలకే ఈ లంచాలు అందుతాయి కాబట్టి పింఛన్లు పెంచడం లేదు. అవ్వతాతలకు వయసు పెరిగే కొద్ది చిన్న చిన్న ఖర్చులు పెరుగుతాయి. అవ్వతాతలకు చెబుతున్నాను..మనందరి ప్రభుత్వం రాగానే పింఛన్‌ వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకే తగ్గిస్తాం. పింఛన్‌  రూ.2 వేలుకు పెంచుతాను. ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల అక్కా చెల్లెమ్మల పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్క వారం పనులు చేయకపోతే  ఇంట్లో జరిగే పరిస్థితి లేదు.  అలాంటి వారి కోసం పింఛన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తున్నాను. రూ.2 వేలు పింఛన్‌ ఖచ్చితంగా ఇ స్తాం కాబట్టి రేపటి గురించి భరోసా ఉంటుంది.  మనం వచ్చిన తరువాత మంచి చేసే కార్యక్రమాలు కొన్ని చెప్పాను. ఇంకా మనం ఏం చేయాలో మీరే సూచనలు, సలహాలు చెప్పండి. మీరు చెప్పేవాటిని పరిశీలించి మన మేనిఫెస్టోలో చేర్చుతాం. మన మేనిఫెస్టో కేవలం రెండు పేజీల్లో మాత్రమే ఉంటుంది. చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసి చూపిస్తానని మాట ఇస్తున్నాను. 
 
Back to Top