బాబు కన్న రాక్షసులే నయం

* జైట్లీ చెప్పినవన్నీ అబద్ధాలు
* కేంద్రమంత్రులు తానా అంటే తందానా అంటున్న చంద్రబాబు
* హోదా ప్రయోజనం కాదనడం విడ్డూరం
* ఏ యాక్ట్‌ ప్రకారం గుజరాత్‌లో ప్రాజెక్టు
* అబద్ధాల ప్రసంగాన్ని చప్పట్లతో ఎంజాయ్‌ చేసిన బాబు
* 14వ ఆర్థిక సంఘం ప్రకారమే రూ. 2 లక్షలా 3 కోట్ల నిధులు
* వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.రాక్షసులు కూడా తమ రాజ్యాలను కాపాడుకొని వేరే రాజ్యాలపై దాడి చేసి నాశనం చేస్తారు గానీ చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు.  కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడులు రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో చెప్పివన్నీ అబద్ధాలే అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కేంద్ర మంత్రులు ఇన్ని అబద్ధాలు చెబుతుంటే చంద్రబాబు వారికి వంతపాడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రులు తానా అంటే చంద్రబాబు తందానా అంటున్నారని ఎద్దేవా చేశారు. అరుణ్‌జైట్లీ తప్పుడు ప్రకటనలపై బొత్స విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని జైట్లీ గొప్పలు చెబుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడగాల్సిందిపోయి అన్ని ఇచ్చేశారని వంతపాడుతున్నాడని మండిపడ్డారు. ఏపీకి, కేంద్రానికి మధ్యవర్తిత్వం వహించే వెంకయ్య కూడా ప్రజలను వంచించడానికి అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఏపీకి 25 విద్యా సంస్థలు, నిధులు ఇచ్చామని, నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి సహాయం ఏ రాష్ట్రానికి అందలేదని వెంకయ్య చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా వల్ల నిధుల వాటాలో 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రం భరిస్తే ఎలాంటి ప్రయోజనం లేదని జైట్లీ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వారు పచ్చి అబద్ధాలు చెబుతుంటే చంద్రబాబు వాళ్లను పొగడ్తలతో ముంచెత్తుతున్నారని ఫైరయ్యారు. ప్రజలకు చదవు, సంధ్య అనుకుంటున్నారా అని మండిపడ్డారు.

దేశ చరిత్రలోనే ఇలాంటి ఆర్ధికమంత్రిని చూడలేదు
కోటి జనభా దాటిన రాష్ట్రానికి విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని అనాటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని బొత్స గుర్తు చేశారు. దేశంలోని అతి చిన్న రాష్ట్రంలో కూడా విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన విషయం వాస్తవం కాదా అని జైట్లీని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రమైన చతీస్‌ఘడ్‌లో కూడా ఏర్పాటు చేశారని, అది చట్టంలో పెట్టారా? అని నిలదీశారు. దేశ చరిత్రలో ఏ ఆర్థిక మంత్రి ఇలాంటి ప్రకటనలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. ఏ యాక్ట్‌ ఉందని రూ. 60 వేల కోట్లతో గుజరాత్, మహారాష్ట్ర సరిహద్దుల్లో 60 వేల మిలియన్‌ టన్నుల సామర్థ్యం గల  ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టు చట్టంలో ఉందా? లేక పార్లమెంట్‌లో బిల్లు పెట్టారా అని విరుచుకుపడ్డారు. దేశంలోని అభివృద్ధిని కాంక్షించి ఏర్పాటు చేశారని చెప్పారు. కేంద్రంలో ఆర్థిక మంత్రి హోదాలో ఉన్న జైట్లీ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం శోచనీయమన్నారు. 
బాబు చప్పట్లు కొట్టడం సిగ్గుచేటు
ఎప్పుడులేని విధంగా ఏపీకి రూ. 2 లక్షల 3 కోట్లు కేటాయిస్తున్నామని జైట్లీ అబద్ధాలు చెబుతుంటే చంద్రబాబు చప్పట్లు కొట్టుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నాడని బొత్స ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం ఆదేశాల మేరకు నిధులు కేటాయిస్తే దాన్ని బీజేపీనే ఇస్తున్నట్లుగా ప్రకటించుకుంటున్నారని స్పష్టం చేశారు. 2004–08లో రూ. 34 వేల 970 కోట్లు గత ప్రభుత్వాలు కేటాయించారని, 2009–14లో రూ. 69 వేల 293 కోట్లు ఇస్తే మేం రూ. 2 లక్షల 3 వేల కోట్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. 14వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం ఇచ్చారని ప్రజలకు తెలియదనుకుంటున్నారా అని ప్రశ్నించారు. నాలుగు అంశాల ప్రతిపాదికన రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తారని బొత్స స్పష్టం చేశారు. 50 శాతం పేదరికం ఉన్న రాష్ట్రాలకు నిధులు 50 శాతం, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు 27.5 శాతం నిధులు కేటాయిస్తారు. అదే విధంగా 15 శాతం నిధులను రాష్ట్ర బౌగోళిక స్వరూపం ఆధారంగా, మిగిలిన 7.5 శాతం నిధులను అధికంగా అడవులు ఉన్న రాష్ట్రాలకు కేటాయిస్తారని చెప్పారు. మొత్తం 100 శాతం నిధులను 14 ఫైనాన్స్‌ కమిషన్‌ నాలుగు అంశాల ఆధారంగా కేటాయిస్తుందని చెప్పారు. ఇందులో ఏపీకి కేంద్రం చేసిన సాయం ఏమీలేదని చెప్పారు. చట్టంలో పెట్టినవి చేసుకుంటూ గొప్పలు చెప్పుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఫైనాన్స్‌ కమీషన్‌ ఏపీకి 5 సంవత్సరాలకు కలిసి రూ. 1,69,969 కోట్లు కేటాయిస్తే, రెవెన్యూ లోటు కింద 22 వేల కోట్లు, పంచాయతీరాజ్‌ ఇనిస్టిట్యూషన్‌కి ఇచ్చే ని«ధులన్ని కలుపుకొని రూ. 2 లక్షలా మూడు కోట్లు అవుతుందన్నారు. దీంట్లో స్పెషల్‌గా ఏపీకి ఇచ్చినవి ఏమీ లేదని చెప్పారు. జైట్లీ ఇన్ని అబద్ధాలు చెబుతుంటే కంప్యూటర్‌ కనిపెట్టానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఏమీ మాట్లాడలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ ప్రశ్నలపై జైట్లీ, వెంకయ్య, చంద్రబాబులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎంతసేపు దోపిడీ, ధనదాహం తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టవా అని బాబును నిలదీశారు. రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారని ప్రశ్నించారు. 
కమీషన్ల కోసమే పోలవరం
కమీషన్లకు కక్కుర్తి పడి జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుందని బొత్స విమర్శించారు. రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరాన్ని చంద్రబాబు నాశనం చేయడానికి పూనుకున్నాడని మండిపడ్డారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం అనే ప్రాజెక్టులను తీసుకొచ్చారని, అసలు పోలవరం కడుతారో లేదోనని భయాందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకోవడానికి స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని తీసుకొచ్చి అద్బుతమైన రాజధాని అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదీ ఆ అద్భుతమైన రాజధాని అని ప్రశ్నించారు. విదేశాలకు అప్పగించి రియలెస్టేట్‌ వ్యాపారంతో కోట్లు సంపాదించుకోవాలని బాబు భారీ స్కెచ్‌ వేశారని ఆరోపించారు. చంద్రబాబు కన్న రాక్షసులే నయమని చెప్పారు. ఇప్పటికైనా స్వార్థ ప్రయోజనాలను పక్కబెట్టి ప్రజా పరిపాలన సాగించాలని సూచించారు.
Back to Top