మరో దోపిడీకి బాబు తెర

  • పోలవరం కోసం హోదాను వదులుకోవడంలో ఆంతర్యమేంటి..?
  • మీ స్వార్థం, దోపిడీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారు..?
  • ప్రజలను వంచించడం, ఆడిన మాట తప్పడంలో బాబు సిద్ధహస్తుడు
  • బాబు మాటల గారడీని ప్రజలు గ్రహించాలి
  • పోలవరం వైయస్ఆర్ కలల పంట
  • వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్ః చంద్రబాబు ప్రభుత్వం పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకం పేరుతో మరో దోపిడీకి తెరతీసిందని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికల్లో మూటలు మోసిన వాళ్లకు కాంట్రాక్ట్ లు కట్టబెడుతూ నిన్నటి రోజున బాబు దానికి శంకుస్థాపన చేయడాన్ని ప్రజలు చూశారన్నారు. పోలవరం కోసమే ప్రత్యేక హోదాను వదులుకొని ప్యాకేజీ ఒప్పుకున్నానంటూ బాబు మాట్లాడడాన్ని బొత్స తీవ్రంగా తప్పుబట్టారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.  రాష్ట్ర విభజన సమయంలో  అధికార, ప్రతిపక్షాలు కలిసి  హోదా హామీ ఇచ్చారని, పోలవరాన్ని విభజన చట్టం సెక్షన్ 90లో జాతీయప్రాజెక్ట్ గా పొందుపర్చి తామే చేపడుతామని ముందుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బాబు హోదా తేకపోవడం వల్ల రాష్ట్రం నష్టపోయిందని, సామాన్యులకు అభివృద్ధి ఫలాలు అందుబాటులోకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన మంది మార్భలానికి కాంట్రాక్ట్ లు వస్తాయనే బాబు పోలవరాన్ని తెచ్చుకున్నారని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. 

పోలవరం కోసం రాష్ట్రానికి సంజీవని లాంటి హోదాను వదులుకున్నాని చెప్పడంలో ఆంతర్యమేంటని బొత్స బాబును నిలదీశారు. మీ స్వార్థం, దోపిడీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పోలవరాన్ని కట్టాలి, రాష్ట్రాన్ని జాతికి అంకితం చేయాలన్న ఉద్దేశ్యంతో 2005లో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అంకురార్పణ చేశారని, పోలవరం వైయస్ఆర్ స్వప్నం అని బొత్స వివరించారు. పోలవరం నా కల అంటూ బాబు కళ్లబొల్లి మాటలు చెబుతున్నారని బొత్స మండిపడ్డారు. 2004కు ముందు 15 ఏళ్లలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాని కల ఇప్పుడు గుర్తొచ్చిందా..?ప్రజల ఆశయం నెరవేర్చాలని మీకు లేదా...? అని నిలదీశారు. వైయస్ఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం కల నెరవేరాలని వైయస్సార్సీపీ ఎప్పుడూ కోరుకుటుందన్నారు. వైయస్సార్సీపీ పోలవరానికి గానీ, అమరావతి అభివృద్ధికి గానీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని,  ప్రభుత్వ దోపిడీకి మాత్రమే వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు. బాబు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. 

తమ నాయకుడు వైయస్ జగన్ పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలంటే...పోలవరానికి అడ్డుపడుతున్నారని బాబు అసత్య ప్రచారం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు.  చంద్రబాబు 2011లో మీరు మాట్లాడిన మాటలేంటి, ఇప్పుడు మీరు చెబుతున్నదేంటని నిలదీశారు.  పునరావాస చట్టం ప్రకారం నిర్వాసితులు కోరుకున్న ప్రాంతంలో భూములు ఇవ్వాలి. గిరిజనులకు ఎకరం కంటే అదనంగా ఇవ్వాలి. ప్రతీ కుటుంబానికి రూ. 5లక్షలు పరిహారం ఇవ్వాలి.  ప్రస్తుత మేజర్ అయిన ఆడపిల్లలకు కూడా ప్యాకేజీ ఇవ్వాలి. మేం అధికారంలోకి వస్తే నిర్వాసిత కుటుంబాలకు, చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటలు ఏమయ్యాయని బాబును ప్రశ్నించారు. ఇదే మాట జగన్ అడిగితే ఆటంకమంటారా..?మీరు మాట్లాడితే అభివృద్ధి, మేం మాట్లాడితే అడ్డంకినా..? ఏంటి బాబు మీ మాటలు..? పోలవరానికి ఆరోజు అడ్డుపడింది మీరు కాదా..? రెండుసార్లు పర్యావరణ అనుమతులొస్తే సాకులు చూపి ఆపడానికి ప్రయత్నించి మీరు కాదా..? చత్తీస్ ఘడ్, ఒరిస్సా ముఖ్యమంత్రులతో కేసులు వేయించింది నీవు కాదా...? ఇవాళ నంగనాచిలాగ కబుర్లు చెబుతారా అంటూ చంద్రబాబుపై బొత్స తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

స్వర్గీయ  వైయస్ఆర్ కలల పంట అయిన పోలవరం రావాలని కోరుకుంటున్న ఏకైక పార్టీ వైయస్సార్సీపీయేనని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పోలవరం పూర్తి కావాలన్నది ఏపీ ప్రజల చిరకాల వాంఛ అని దానికోసం వైయస్సార్సీపీ పోరాడుతుందని బొత్స చెప్పారు. రెండేళ్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉండి..కాంట్రాక్ట్ లకు కక్కుర్తి పడి బాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టాడని బొత్స విమర్శించారు. కాలువలకోసారి టెంకాయ కొట్టి, కాంక్రీట్ వేస్తే వంకాయ ఇలా ఎప్పుడూ తాము చూడలేదని, బాబు పాలనలోనే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. పట్టిసీమకు, పురుషోత్తంపట్నంకు పెట్టే 4, 5 వేల కోట్లు...పోలవరానికి ఖర్చుపెట్టి ఉంటే  ఎంతో బాగుండేదన్నారు. పోలవరం నిర్మాణంపై ముఖ్యమంత్రి, మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు. కృష్ణా-గోదావరి అనుసంధానం జరిగితే రబీలో 9లక్షల హెక్టార్లే ఎందుకు సాగవుతుందంటే ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. ఎంతసేపు కళ్లబొల్లి మాటలు చెప్పడం. దాటవేయడం. వంచించడం బాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. చంద్రబాబు అనే వ్యక్తి ఇవాళ మాట్లాడిన మాట రేపు కాదనడంలో చెప్పడంలో సిద్ధహస్తుడని తూర్పారబట్టారు. బాబు తాలూకా మాటల గారడీని ప్రజలు గమనించాలన్నారు. గతంలో బాబు చేసిన మాటల గారడీని, ప్రజలను వంచించిన తీరును  వీడియోముఖంగా చూపించారు. మీ పాలనలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కు అయిన అంకురార్పణ చేశారా..? ఎత్తిపోతల పథకాలు పెట్టి ప్రజాధనం దోచుకుతినడం ఎంతవరకు సబబని నిలదీశారు. విభజన చట్టంలోని హామీలతో పాటు పోలవరం పూర్తిచేయడానికి ఉన్న ఆటంకాలపై దృష్టిసారింటాలని హితవు పలికారు. అంతేగానీ ఎంతసేపు మైక్ పట్టుకొని ఎదుటివాళ్లను ఆడిపోసుకుంటే, అబద్ధాలను నిజం చేయాలనుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తి లేరని, ఇప్పటికైనా మీ దోపిడీని ఆపి నిర్దిష్టమైన కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.  

Back to Top