<strong>ధూళిపాళ (గుంటూరు జిల్లా),</strong> 3 మార్చి 2013: ప్రజా కంటకంగా పరిపాలించిన చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పినట్లు ప్రస్తుత ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకీ గుణపాఠం చెప్పాలని మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, జననేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి పరోక్షంగా వత్తాసు పలుకుతున్న చంద్రబాబు తీరుకు నిరసనగా శ్రీ జగన్ తరఫున శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా ధూళిపాళ కాలనీలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.<br/>రాష్ట్ర ప్రజలందరినీ కన్నబిడ్డల మాదిరిగా చూసుకున్న మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మరణంతో ఆయన ప్రవేశపెట్టిన పథకాలేవీ కూడా తమకు అందడం లేదని కాలనీవాసులు శ్రీమతి షర్మిలకు విన్నవించారు. కడప ఎం.పి. వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే మంచి రోజులు వస్తాయని శ్రీమతి షర్మిల ధూళిపాళ కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. పిల్లలను వీలైనంత బాగా చదివించాలని వారికి సూచించారు. ఎంత కష్టం వచ్చినా పొలాలు మాత్రం అమ్ముకోవద్దని, అవి ఎంతో విలువైనవి అని రైతులకు శ్రీమతి షర్మిల హితవు చెప్పారు.