బహిరంగ చర్చకు సిద్ధమా

విజ‌య‌వాడ‌: మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమా కనుసన్నలలో స్థానిక తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న అవినీతి,అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని జిల్లాపరిషత్‌ సభ్యులు కాజా బ్రహ్మయ్య మండల నాయకులకు సవాల్‌ చేశారు. బుధ‌వారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నాయకులు మట్టి,ఇసుక,మద్యం, ఇలా అన్నింటిలో చేసే అవినీతి,అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి వైయస్ఆర్‌సీపీ నాయకులపై మాటల యుద్దానికి దిగుతున్నారన్నారు. దొంగే దొంగా,దొంగా అన్నట్లుగా ఉందన్నారు టీడీపీ నాయకుల వ్యవహారం.అక్రమంగా వేల ట్రక్కుల మట్టిని ఇటుక బట్టీలకు తరలించిన టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై నాన్‌బైలబుల్‌ కేసులు పెట్టించడం దుర్మార్గమైన చర్య అన్నారు.టీడీపీ నాయకులు నియోజక వర్గంలో ఉన్న అన్ని చెరువులనుండి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరిపినా ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదన్నారు.సాక్షాత్తూ ఇరిగేషన్‌ అధికారి ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లు ఆయన అన్నారు.జి.కొండూరుచెవుటూరు బైపాస్‌ బాధిత రైతులకు పరిహారం పెంపు విషయమై వైయ‌స్ఆర్‌సీపీ ధ‌ర్నాలు చేస్తే కలెక్టరుగారి పుణ్యమాని పరిహారం పెరిగితే అది కూడా నావల్లనే జరిగిందని మంత్రి ఉమా పదేపదే సన్మానాలు చేయించుకుంటున్నారన్నారు. పోలవరం కాల్వ క్రింద 227/1 సర్వే నంబరులో గల బూములు కోల్పోయిన రైతులకు అందవలసిన పరిహారం 3కోట్లరూపాయలు ప్రభుత్వం నుండి రాకుండా స్థానిక టీడీపీ నాయకులే అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.వీటన్నింటిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మండల టీడీపీ నాయకులకు కాజా బ్రహ్మయ్య సవాల్‌ విసిరారు. 

Back to Top