చంద్రబాబు ముమ్మాటికీ రైతు వ్యతిరేకి


-గతంలో తూటాలతో చంపించి.. ఇప్పుడు ఆత్మహత్యలా
- రైతులకు మేలు చేయలేని నువ్వు రైతుబిడ్డవు ఎలా అవుతావ్‌
- అసెంబ్లీలో బాబు నటనకు నంది అవార్డు ఇవ్వాలి
- రైతులకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలి
- అన్నం పెట్టే రైతులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా..?

విజయవాడ: సీఎం చంద్రబాబుది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు. గతంలో ఎల్బీ స్టేడియం వద్ద రైతులు ధర్నా చేస్తే పోలీసులతో కాల్చి చంపించిన చంద్రబాబు.. ప్రస్తుతం నష్టపరిహారం కోసం ఉద్యమించిన రైతులను ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారని మండిపడ్డారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్తే పరిష్కారం అవుతుందేమోనని ఆశించి అసెంబ్లీకి బయల్దేరిన రైతులను చంద్రబాబు ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారని దుయ్యబట్టారు. అసెంబ్లీకి ప్రతిపక్షం రాలేదు.. ప్రజా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని గొప్పగా మాట్లాడిన టీడీపీ నేతలు రైతుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించారో చెప్పాలన్నారు. కొన్ని కంపెనీలు ఉత్పత్తి చేసిన నకిలీ విత్తనాలతో రైతులు కొన్ని కోట్లు నష్టపోయారని, దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారని గుర్తు చేశారు. పరిహారం ఇవ్వకుండా సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన రైతులను ఎందుకు భయపడ్డారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

రైతు బిడ్డ అని నోటి నుంచి చెప్పుకోవడం కాదు చంద్రబాబూ.. ఆలోచన విధానాలు కూడా రైతులకు మేలు చేసేలా ఉండాలని పార్థసారధి సూచించారు. రైతులను చంపే నువ్వు రైతు బిడ్డవు ఎలా అవుతావని ఎద్దేవా చేశారు. రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వం వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తుందని మండిపడ్డారు. కృష్ణా జిల్లాకు ముగ్గురు పనికిరాని మంత్రులు ఉన్నారని, జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని దద్దమ్మలుగా తయారయ్యారని ఆరోపించారు. పోలీసులను మాత్రం చక్కగా వాడుకుంటూ రైతులను వేధిస్తున్నారన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలన్నారు. 

టీడీపీ ప్రభుత్వ మోసాలకు హద్దూ.. అదుపు లేకుండా పోయిందని, చంద్రబాబును పొగిడేందుకు వేదికగా అసెంబ్లీని వాడుకుంటున్నారని పార్థసారధి మండిపడ్డారు. నంది అవార్డులు సినిమా వాళ్లకు కాకుండా అసెంబ్లీలో చంద్రబాబు చేసే నటనకు ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పోలవరం విషయంలో వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని, అసెంబ్లీ సాక్షిగా 2018 లోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చెప్పారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానికి ఉంటే దాన్ని కమీషన్ల కోసం చంద్రబాబు తీసుకున్నారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నాలుగు సంవత్సరాల్లో రూ.5,130 కోట్లు ఖర్చు చేస్తే, చంద్రబాబు కేంద్రం సహకారంతో మూడున్నర సంవత్సరాల్లో రూ. 7 వేలకోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. అసలు కేంద్రం పోలవరం విషయంలో సహకరిస్తుందా లేదా..చెప్పాలన్నారు.


Back to Top