హోదాకు సంకెళ్లు



- బంద్‌లో పాల్గొన్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల అరెస్టు
- ఉద్య‌మంపై చంద్ర‌బాబు ఉక్కుపాదం
-నిర్బంధాలు లెక్క చేయ‌కుండా బంద్‌లో పాల్గొంటున్న పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్య‌మంపై చంద్ర‌బాబు ఉక్కుపాదం మోపుతున్నారు. మొద‌టి నుంచి చంద్ర‌బాబుకు హోదా అన్న మాటంటే గిట్ట‌డం లేదు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌తి పోరాటంపై పోలీసుల‌ను ప్ర‌యోగించి ఉద్య‌మాన్ని అణ‌చివేసే ప్ర‌య‌త్నం చేశారు. యువ‌భేరిల‌కు హాజ‌రైతే విద్యార్థుల‌పై పీడీ యాక్ట్ కేసులు పెడ‌తామ‌ని, జైల్లో పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు. తాజాగా ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిర‌సిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చిన పిలుపు మేర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా బంద్ కొన‌సాగుతోంది. 

మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బంద్‌లో పాల్గొన్నాయి. వాహనాలు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులను అరెస్ట్‌ చేయిస్తోంది. పలువురు నాయకులను గృహనిర్బంధంలో ఉంచింది. గుంటూరులో అంబ‌టి రాంబాబు, ఎమ్మెల్యేల‌ను అరెస్టు చేశారు. విజ‌య‌వాడ‌లో పార్టీ నాయ‌కులు పార్థ‌సార‌ధి, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, మ‌ల్లాది విష్ణు త‌దిత‌రుల‌ను పోలీసు స్టేష‌న్ త‌ర‌లించారు. 

చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేలు రోజా, నారాయ‌ణ స్వామి,  సునీల్‌కుమార్‌, చింత‌ల రామ‌చంద్రారెడ్డిల‌ను అరెస్టు చేశారు. వైయ‌స్ఆర్ జిల్లాలో ఎమ్మెల్యేలు ర‌ఘురామిరెడ్డి, శ్రీ‌కాంత్‌రెడ్డి, త‌దిత‌రుల‌ను అరెస్టు చేశారు. క‌ర్నూలు జిల్లాలో బీవై రామ‌య్య‌, హాఫీజ్ ఖాన్ త‌దిత‌రుల‌ను అరెస్టు చేశారు. ప్ర‌కాశం జిల్లాలో ఎమ్మెల్యేలు బాలినేని శ్రీ‌నివాస్‌, జంకే వెంక‌ట్‌రెడ్డిల‌ను అరెస్టు చేశారు. విశాఖలో వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స‌స‌త్య‌నారాయ‌ణ‌, ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, శ్రీ‌కాకుళంలో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, త‌మ్మినేని సీతారాంల‌ను అరెస్టు చేశారు. మ‌హిళా నాయ‌కుల‌ను కూడా బ‌ల‌వంతంగా అరెస్టు చేసి ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల్లోని పోలీసు స్టేష‌న్ల‌లో నిర్బంధించారు.

ప్రత్యేక హోదా కోసం బంద్‌ చేస్తున్న ఆందోళనకారులను కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు అడ్డుకున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతున్న వారిపై దౌర్జన్యం చేశారు. మహిళల పట్ల నంద్యాల డీఎస్పీ దురుసుగా వ్యవహరించారు. మహిళా పోలీసులు లేకుండానే మహిళలను ఇష్టానుసారంగా లాగి పడేశారు. గాయాలయి రక్తమోడుతున్నా పోలీసులు పట్టించుకోకుండా అమానవీయంగా ప్రవర్తించారు. మరోవైపు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. కొంతమందిని గృహనిర్బంధంలో ఉంచారు. బంద్‌లో పాల్గొన్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ప్రత్యేక హోదా కోసం బంద్‌ చేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను అరెస్ట్‌ చేయడాన్నిపార్టీ నాయ‌కులు, ప్ర‌జా సంఘాలు, ఇత‌ర పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.   ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చూడటం దారుణంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఒక వైపు హోదా కోసం తామే పోరాడుతున్నామని చంద్రబాబు చెబుతూ మరో వైపు పోలీసులతో అరెస్టులు చేయించడం చంద్రబాబుకు తగదని అన్నారు.ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఒక హక్కు..దాన్ని చంద్రబాబు కాలరాస్తున్నారని మండిపడ్డారు. గతంలోననూ చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారని విమర్శించారు.  ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు..హోదా ఉద్యమానికి చంద్రబాబు మద్ధతు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేయవద్దని విన్నవించారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేయలేదా అని ప్రశ్నించారు. అరెస్ట్‌లతో ఉద్యమాన్నిఅణచివేస్తామనుకోవడం చంద్రబాబు అవివేకమని వ్యాఖ్యానించారు. అరెస్ట్‌ చేసిన వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.



Back to Top