తమ్ముళ్లను తప్పించేందుకే సీపీకి సెలవు..?

కాల్ మనీ కేసు నీరుగార్చే కుట్ర
కేసు కీలకదశలో ఉన్న సమయంలో సెలవుపై సీపీ
టీడీపీ నేతలను రక్షించేందుకు చంద్రబాబు ప్రయత్నం
మిగతా పార్టీల నేతలపై బురదజల్లే యత్నం
చంద్రబాబు తీరుపై అంబటి రాంబాబు ఫైర్
 
హైదరాబాద్ః వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంనుంచి చంద్రబాబు తెలుగు తమ్ముళ్లను తప్పించాలని చూడడం దారుణమన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల ప్రోద్భలంతో కాల్ మనీ అధిక వడ్డీల వ్యాపారం సాగడమే గాకుండా అది వికృత రూపం దాల్చి సెక్స్ రాకెట్ గా మారిందన్నారు. కేసు కీలక దశలో ఉన్న సమయంలో చంద్రబాబు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతంసవాంగ్ ను సెలవుమీద పంపించాలని చూడడం దుర్మార్గమన్నారు. టీడీపీ నేతలను రక్షించడం కోసమే చంద్రబాబు సీపీని సెలవుపై పంపిస్తున్నారని దుయ్యబట్టారు. 

గుంటూరులో పంటలు తగలబెట్టిన కేసులో కూడా..సిన్సియర్ గా పనిచేసిన ఇద్దరు ఎస్పీలను చంద్రబాబు ట్రాన్స్ ఫర్ చేశారన్నారు. బాగా పనిచేసే అధికారులను లూప్ లైన్ లో పెట్టి చంద్రబాబు తన మాట వినేవారికి కీలక పోస్టింగ్ లిస్తున్నారని అంబటి రాంబాబు ఫైరయ్యారు.  మంత్రుల ప్రాబల్యంతో వడ్డీ వ్యాపారులు మితీమిరి ఆస్తులను ఆక్రమించడమే గాకుండా వారి మాన, ప్రాణాల్ని దోచుకుంటుంటే...చంద్రబాబు బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి తెలుగుతమ్ముళ్లను కేసు నుంచి కాపాడుకునేందుకు సీపీని బదిలీ చేయడం సిగ్గుచేటన్నారు.  ఇలాంటి దుర్మార్గులు, రౌడీలు, సంఘవిద్రోహ శక్తులనుంచి ప్రజల్ని ఎవరు కాపాడుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కాల్ మనీ సెక్స్ రాకెట్ లో టీడీపీ నేతలున్నట్లు స్పష్టంగా తేలితే వారిని కఠినంగా శిక్షించాల్సింది పోయి...పోలీసులను ఉసిగొల్పి ఇతర ప్రతిపక్షాలకు దాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గుంటూరులో వైఎస్సార్సీపీ యువజన విభాగానికి చెందిన మనోహర్ నాయుడు ఇంటిపైకి 30, 40 మంది పోలీసులతో సోదా చేయించారు. బెడ్, గ్యాస్ , పేస్ట్ తప్ప ఇంకేమీ దొరకలేదన్నారు.  ఎలాగైనా వైఎస్సార్సీపీ నాయకులను  ఈకేసులో ఇరికించాలన్న తాపత్రయంతో చంద్రబాబు ఉండడం దురదృష్టకరమన్నారు.  రాష్ట్రంలో ఎవరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారో మీకు తెలియదా అంటూ అంబటి ప్రభుత్వాన్ని నిలదీశారు . 

క్లిష్టమైన పరిస్థితుల్లో పరిపాలన చేయాల్సిన చంద్రబాబు పోలీస్ వ్యవస్థను సన్నగిల్లేలా చేస్తున్నారని అంబటి విమర్శించారు.  విజయవాడలో వికృత నాట్యం చేస్తున్న వారిని శిక్షించండి. అంతేగానీ  నేరం చేయని పార్టీల వారిని లోపల వేసేందుకు వెంపర్లాడడం సరికాదని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎవరి ఇళ్ల మీద పడితే వాళ్ల ఇళ్లమీద దాడి చేసి  బెదిరించాలని చూస్తే సహించేది లేదన్నారు. పోలీసులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఫిర్యాదు దారులకు నమ్మకం కలిగే విధంగా చూడాలన్నారు. విజయవాడను దుష్టశక్తుల నిలయంగా తయారుచేయవద్దని ప్రభుత్వానికి సూచించారు. 

కాల్ మనీ అప్పులు కట్టవద్దంటూ మాటలు చెప్పడం కాదని...మహిళల నుంచి నిందితులు లాక్కున్న దస్తావేజులు, చెక్కులు, ప్రాంసరీ నోట్లు సహా మొత్తం వారికి ఇప్పించేలా చూడాలని అంబటి  చంద్రబాబుకు హితవు పలికారు. చంద్రబాబు గతంలో కూడా రుణమాఫీ కట్టకండి అని చెబితే బ్యాంకువాళ్లు ఊరుకున్నారా అని ఎద్దేవా చేశారు. ఐదు కోట్లు పెట్టి ఎమ్మెల్సీ కొన్న నీవు...తానేదో నీతివంతుడన్నట్లు తప్పులను అధికారుల మీదకు నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ఓ రైతు అరటి తోటను దున్నేసి పొరపాటున దున్నేశామని చెబుతున్నారంటే ఈప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. ఇంతటి దౌర్భాగ్య పరిపాలన చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. 
Back to Top