మోసం..మోసం..మ‌రోసారి మోసం

 



–కాపులను బీసీ జాబితాలో చేర్చడం అశాస్త్రీయంగా  జరిగింది
– మంజునాథ్‌ రిపోర్టే అందజేయలేదని చెబుతున్నారు
– ఇలాంటి జీవోలు నిలబడవు
– కాపులంతా సంతోషంగా ఉన్నారనే భ్రమ కల్పిస్తున్నారు.
– పోలవరం నీలి నీడలు టీడీపీని భయపెట్టాయి
–  మీ నెత్తి మీది బాధ్యతను మోడీ నెత్తిన పెట్టారు

విజయవాడ: చంద్రబాబుకు కాపులను బీసీ జాబితాలో చేర్చాలనే చిత్తశుద్ధి, ఆలోచన లేదని, మరోమారు మోసం చేసే ప్రయత్నం చేశారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హడావుడిగా అసెంబ్లీలో బిల్లు పెట్టి, ఆ బిల్లును కేంద్రానికి పంపించడం శాస్త్రీయంగా జర‌గలేదన్నారు. మంజునాథ్‌ కమిషన్‌ ఇంతవరకు రిపోర్టు ఇవ్వలేదని, అలాంటి సమయంలో ఎలా బీసీ బిల్లు అంటూ తీర్మానం చేశార‌ని ప్ర‌శ్నించారు. శనివారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 1956లో కాపులను  బీసీ జాబితా నుంచి తొలగించారని, ఎప్పటి నుంచో త‌మ‌ను తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని ఉద్యమిస్తున్నారన్నారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని హామీ ఇవ్వడంతో కాపులంతా ఓట్లు వేసి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారని, చంద్రబాబు కూడా దీన్ని అంగీకరించారన్నారు. ఇవాళ కాపులను బీసీ జాబితాలో చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పండుగ వాతావరణం ఉందని హడావుడి చేశారన్నారు. కాపుల పాలిట చంద్రబాబు దేవుడని టీడీపీ నేతలు పొగడటం విడ్డూరంగా ఉందన్నారు. 

బాబుకు చిత్తశుద్ధి లేదు
కాపులను బీసీ జాబితాలో చేర్చాలన్న ఆలోచన, చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉన్నట్లు ఏ కోశాన క‌న‌బ‌డ‌టం లేదని అంబటి రాంబాబు విమర్శించారు.  చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 19 మాసాలు మౌనంగా ఉన్నారన్నారు. జనవరి 2016లో మంజునాథ కమిషన్‌ వేశారన్నారు. ఉద్యమం కారణంగానే ఆయన ఈ కమిటీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 22 మాసాలు ఆ కమిటీ సభ్యులు అన్ని జిల్లాల్లో తిరిగి అభిప్రాయాలు సేకరించారన్నారు. కాపులను బీసీ జాబితాలో చేర్చేందుకు మాత్రమే ఈ కమిషన్‌ ఏర్పాటు చేయలేదని చాలా సందర్భాల్లో టీడీపీ నేతలు చెప్పారన్నారు. మంజునాథ్‌ కమిషన్‌ ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదని,  ఎక్కడా కూడా చర్చ జరగలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మంజునాథ్‌ కమిటి నివేదికను ఇంత వరకు వెలుగులోకి తీసుకురాలేదన్నారు. ఈ కమిటీ నివేదికను ఎందుకు రహస్యంగా ఉంచారని ప్ర‌శ్నించారు. శాస్త్రీయత లేని ఓ నివేదిక ఆధారంగా కాపులను బీసీ జాబితాలో చేర్చుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో కాపులను న్యాయం జరుగుతుందా? అని అనుమానం వ్య‌క్తం చేశారు. ఇది ప్రభుత్వం కావాలనే వేసిన కమిషన్‌ కాబట్టి దీన్ని తీసుకొని కేంద్రం నెత్తిన పెట్టినంత మాత్రానా న్యాయం జర‌గదన్నారు. మంజునాథ్‌ అనే వ్యక్తి అసలు రిపోర్టే అందజేయలేదని చెబుతుంటే, ఆదురా బాద‌రాగా  ఈ బిల్లు ఎందుకు ఆమోదించారన్న అంశంపై అనుమానాలు ఉన్నాయన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు హడావుడిగా బిల్లు పెట్టారని విమ‌ర్శించారు.

ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం..
పోలవరం అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కాపులను బీసీ జాబితాలో చేర్చార‌ని, ఇదంతా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమ‌ని విమ‌ర్శించారు అంబటి రాంబాబు. కేవలం మీ బాధ్యతను మీ తల నుంచి దించి కేంద్రం నెత్తిన పెట్టారే తప్ప..ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. 9వ షెడ్యూల్‌లో పెట్టినా కూడా దీన్ని కాద‌నే హ‌క్కు న్యాయ స్థానాలకు ఉందని గతంలో చూశామన్నారు. ఇవాళ చంద్ర‌బాబు చేసింది దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. గ‌తంలో కూడా ఇదే ఇందిరా సహని కేసులో స్పష్టమైంద‌న్నారు. నలుగురు సభ్యులుగా ఉన్న మంజునాథ్‌ కమిటీలో ఎందుకు వేర‌య్యార‌ని, మంజునాథ్ క‌మిటీ రిపోర్టు ఎందుకు ఇవ్వ‌లేద‌ని నిల‌దీశారు. 

మంజునాథ్‌ కమిటీ నివేదిక ఎక్కడా?
రాబోయే ఎన్నికల్లో తాను బయటపడే ఉద్దేశంతోనే  చంద్ర‌బాబు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప, ఆయనకు చిత్తశుద్ధి లేదని అంబ‌టి విమ‌ర్శించారు. గతంలో  కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కూడా కంటి తుడుపు చర్యగా ఇలాంటి జీవో విడుదల చేశారని, ఆ జీవోకు విలువ లేకుండా పోయింద‌న్నారు. చంద్రబాబు విడుదల చేసిన జీవో కూడా గాలికి కొట్టుకుపోతుందని చెప్పారు. ఇప్పటికైనా మంజునాథ్ కమిటీ రిపోర్టును బహిర్గతం చేసి, దానిపై చర్చించాల‌ని డిమాండు చేశారు. 
 

Back to Top