బాబు రాక్షస పాలనను అంతమొందిద్దాం

  • ఏపీలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అపహాస్యం
  • దౌర్భాగ్యమైన విషసంస్కృతిని ప్రవేశపెట్టిన బాబు
  • ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో నగ్నంగా నిలబెట్టిన బాబు 
  • నమ్ముకున్న వారిని నట్టేట ముంచి..ఫిరాయింపుదారులకు అందలం
  • చంద్రబాబు రాక్షస పాలనను అంతమొందించేందుకు..
  • అన్ని శక్తులు ఏకం కావాలి
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపు
గుంటూరుః నమ్ముకున్న వారిని నట్టేట ముంచే చంద్రబాబు లాంటి రాక్షసుడిని ప్రజాస్వామ్యంలో సంహరించేందుకు అన్ని ప్రజాస్వామ్య శక్తులు, టీడీపీలోని శక్తులు ఐక్యం కావాల్సిన తరుణం ఆసన్నమైందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు రాక్షస, దుష్టపరిపాలనను అంతంచేసేందుకు అంతా ఏకమై ఉద్యమరూపం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో నగ్నంగా నిలబెట్టిన చంద్రబాబును వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంబటి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు చేసేందుకు వైయస్సార్సీపీ సంసిద్ధమవుతోందని తెలిపారు. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం భారతతదేశ ప్రజాస్వామ్యంలో బ్లాక్ అక్షరాలతో లిఖించదగినదని దుయ్యబట్టారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలు అవలంభిస్తున్న ప్రభుత్వంపై విభిన్న స్థాయిలో పోరాడేందుకు వైయస్సార్సీపీ సన్నద్ధమైందన్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

నమ్ముకున్న వారిని ముంచి దూరంగా ఎదురు పార్టీవాళ్లను తీసుకొచ్చి అందలమెక్కించిన బాబుకు ముందుంది ముసళ్ల పండుగ అంబటి హెచ్చరించారు. బాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.  పీతల, బొజ్జల, పల్లె, రావెల, బోండా వీళ్లను పక్కనబెట్టి...మా పార్టీ నుంచి తీసుకొన్న వాళ్లకు మంత్రి పదవులివ్వడమేంటని ప్రశ్నించారు. మీ పార్టీలో సమర్థులు లేరా అని నిప్పులు చెరిగారు. టీడీపీ పుట్టిన దగ్గర్నుంచి నేటివరకు పార్టీలో ఉండి, బాబుకు నమ్మిన బంటుగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఆయన ఆరోగ్యం బాగోలేదనో ఒంకతో పక్కనబెట్టడం దారుణమన్నారు . గతంలో జక్కంపూడి రామ్మోహన్ రావు నడవలేకపోతున్నాడు, ఆయన్ను తప్పించాలని సోనియాగాంధీకి అనేకమంది రిపోర్ట్ చేసినా, దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ ఆయనకు అన్యాయం చేయలేదన్నారు. నడవలేకపోయినా విధిని నిర్వరిస్తున్నాడు. పార్టీని నమ్ముకున్నవాడు. తొలగిస్తే అర్థంతరంగా చనిపోతాడని భావించి ఆయన్ను కొనసాగించిన మహానుభావుడు వైయస్ఆర్ అని తెలిపారు. నమ్మినవారికోసం ఎంతదూరమైన వెళ్లే నాయకుడు వైయస్ఆర్ అయితే, నమ్ముకున్న వారిని నిండా ముంచే వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. 

చింతమనేని, గోరంట్ల, ధూళిపాళ్ల వీళ్లందరినీ బుజ్జగించి బాబు బోండా ఉమను బెదిరించడం చూస్తుంటే కాపులపై బాబు కక్షపూరిత వైఖరి తెలుస్తోందన్నారు.  కాపుల గొంతు కోస్తున్నారన్న బోండాను నీ సంగతి తేలుస్తా, నీ చిట్టా నాదగ్గర ఉందని బాబు బెదిరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  కాపుల గురించి మాట్లాడే ప్రతి వ్యక్తిని బాబు ఇలాగే బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవలే ముద్రగడను బెదిరంచి దౌర్జన్యం చేసి, వాళ్ల ఫ్యామిలీని బాబు దారుణంగా అవమానించారన్నారు. కడపలో వివేకానందరెడ్డిని ఓడించిన ఘనత మాదని బాబు ప్రగల్భాలు పలుకుతున్నారని, అంత ప్రజాబలమే ఉంటే వైయస్సార్సీపీ సింబల్ పై గెలిపించిన వారిచేత రాజీనామా చేయించకుండా మంత్రి పదవిలోకి తీసుకోవడమేంటని విరుచుకుపడ్డారు. వైయస్సార్సీపీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి  ఉపఎ్ననికలకు వెళ్లే సత్తా నీకుందా అని బాబుకు చురక అంటించారు. కక్కిన కూటికోసం ఆశపడే దౌర్భాగ్యమైన రాజకీయాలు నడుపుతున్న బాబు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలన్నారు. 

నీ పార్టీ బతుకుందో, చస్తుందో  తెలియని రోజుల్లో నిన్ను నెత్తిన పెట్టుకొని మోసిన వారిని మోసం చేసి...అన్యాయంగా మా పార్టీ వాళ్లను తీసుకొని నెత్తిన పెట్టుకున్నావే, వాళ్లు  నిన్ను ముంచరని గ్యారంటీ ఉందా బాబు అని ధ్వజమెత్తారు. దౌర్భాగ్యమైన విష సంస్కృతిని ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతిలో బాబు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. బాబుకు ప్రజాబలం లేదని, అందుకే ఎన్నికలకు రావడం లేదని ఎద్దేవా చేశారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు జరపాల్సివున్నా వాటిని తాబేదారుల చేత వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైయస్సార్సీపీకి ప్రజాబలం అంతకంతకూ పెరుగుతుందన్న అక్కసుతో బాబు వైయస్ జగన్ పై ఏదోరకంగా బురదజల్లాలనే కార్యక్రమం చేస్తున్నాడని మండిపడ్డారు. జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ పచ్చచొక్కా వేసుకొని ఈడీ, అరెస్ట్ అంటూ అవాకులు, చెవాకులు రాయిస్తున్నారని, రాజకీయంగా వైయస్ జగన్ ను దెబ్బతీయాలన్న విషప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆ పత్రికవన్నీ అభూతకల్పనలని,  ప్రజలు నమ్మవద్దని సూచించారు. వైయస్ జగన్ బలపడినప్పుడల్లా కేసులు,  జైలు అంటూ బాబు, ఎల్లోమీడియా మానసికంగా గేమ్ ఆడుతున్నారని అంబటి ఫైర్ అయ్యారు. ఒకటి, రెండు పత్రికలు చేతుల్లో పెట్టుకొని అవాస్తవ కథనాలతో వైయస్ జగన్ ను దెబ్బతీయాలని చూస్తున్న బాబు బండారాన్ని ప్రజలు గమనించారన్నారు. ఇలాంటి పిచ్చిమాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. 



Back to Top