సిగ్గు, శరం ఉంటే చర్చకు రా..!

అక్రమ కట్టడంలో నిద్రపోతున్న చంద్రబాబు
దమ్ముంటే పయ్యావుల  చర్చకు సిద్ధపడాలి
మగాడినని మాట్లాడడం కాదు చేతల్లో నిరూపించుకోవాలి
భూ కుంభకోణాలపై విచారణ జరపాలి

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే ఉరవకొండలో చర్చకు రావాలని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాలు విసిరారు. వాళ్లకు దమ్ముంటే సీబీఐ విచారణకో, సిట్టింగు జడ్జితో విచారణకో సిద్ధం కావాలని, లేనిపక్షంలో ఈ ఆరోపణలన్నింటినీ వాళ్లు అంగీకరించినట్లేనని ఆయన అన్నారు. తాను బినామీ పేర్లతో కొనలేదని, మగాడిలా తన కొడుకు పేరుమీదే భూమి కొన్నానని పయ్యావుల కేశవ్ చెప్పడంపై అంబటి రాంబాబు మండిపడ్డారు. మీరు మగాడిలా కొంటే.. మరి బినామీ పేర్లతో కొన్న చంద్రబాబు, లోకేష్, నారాయణల పరిస్థితేంటి.. వాళ్లు మగాళ్లు కారా అని ప్రశ్నించారు.

మగాడిలా కొన్నానంటున్నావే.. రావెల కిశోర్ బాబు భార్య కూడా డైరెక్టుగా నీలాగే కొన్నారని  పయ్యావులనుద్దేశించి అంబటి ఎద్దేవా చేశారు. అసలు అక్కడ ఎందుకు కొన్నారు.. రాజధాని వస్తోందని ముందే తెలిసి కొన్న మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. ఆ విషయం చెప్పకుండా వైఎస్  జగన్ మీద ఆరోపణలు చేయడం, నిందలు వేయడం ఎందుకని నిలదీశారు. మగాడినని ప్రగల్భాలు పలకడం కాదు, చేతల్లో చూపించుకోవాలని హితవు పలికారు.

తన కథనాలు రాయొద్దంటూ రాత్రి 11 గంటల వరకు సాక్షిలో స్ట్రింగర్ నుంచి వాచ్‌మన్ వరకు ...కాళ్ల బేరానికి వచ్చిన మాట వాస్తవమా కాదా అని అంబటి రాంబాబు కేశవ్‌ను ప్రశ్నించారు. చివరకు తన అవినీతి బయటపడడంతో రంకెలు వేస్తున్నారని దుయ్యబట్టారు. నీ అవినీతి అక్రమాలపై మీ ఉరవకొండలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నీతో చర్చించడనాకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం లేదని , కార్యకర్తను పంపిస్తే చాలని చురక అంటించారు. నీవు రాయలసీమలో పుట్టినవాడివి.. రాజధాని ప్రాంతం గురించి ముందే తెలుసుకుని, అక్కడ భూములు కొనే నక్కజిత్తులు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. 

ఇప్పటివరకు సీబీఐ దృష్టికి రాని కొన్ని వాస్తవాలను బయటకు తీస్తా, కడపలో ఉన్న బినామీ మైనింగులను తీస్తానంటున్న పయ్యావుల కేశవ్... ఇన్నాళ్లూ ఏం చేస్తున్నావ్ గాడిదలు కాస్తున్నారా అని అంబటి  విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు ఎందుకు బయటకు తేలేదు? ఇన్నాళ్లూ ఎందుకు దాచావు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా పయ్యావుల కేశవ్ .  కేవలం మీ మీద వార్త వచ్చిందని బెంబేలెత్తి పోతున్నారన్నారని ఫైరయ్యారు. 

బినామీలన్నంటికీ బాసైన  మీ రింగ్ మాస్టర్ చంద్రబాబు, చినబాబుల పరివారం మొత్తాన్ని తీసుకురావాలని.... ప్రకాశం బ్యారేజి మీదకు వస్తారో, పట్టిసీమ దగ్గరకు వస్తారో రావాలని చర్చకు తాము సిద్ధమని అంబటి స్పష్టం చేశారు. మీ బినామీల లెక్కను తుక్కుతుక్కు చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందన్నారు. మీ నాయకులు బినామీ పేర్లతో కొన్న స్థలంలోకి వస్తారో.. మీ అబ్బాయి పేరు మీద కొన్న నాలుగెకరాల్లోకి వస్తారో రావాలని సవాలు చేశారు.

అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానన్న చంద్రబాబు.. లింగమనేని  అక్రమంగా కట్టిన అవినీతి బంగ్లాలో నిద్రపోతున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీడీపీ నేతలంతా సిగ్గుమాలిన పనులు చేస్తూ, ఆరోపణలు ఎదుర్కోలేక నిప్పుతొక్కిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. భూకుంభకోణాలపై  విచారణ ఎదుర్కోడానికి సిద్ధం కావాలి తప్ప ...వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద బురద చల్లి తప్పుకోవాలని చూడొద్దని హితవు పలికారు. చినబాబు ట్విట్టర్ లో ట్వీట్లు చేయడం కాదని దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. 

చంద్రబాబు అక్రమ కట్టడంలో నివసిస్తాడు..నా అంతటోడు లేడంటాడు. వేలుకు ఉగరం లేదు అంటాడు..బినామీల పేరుతో  వేల ఎకరాలు దోచుకుంటామంటాడు. మీకు నీతి నిజాయితీ రవ్వంతా ఉన్నా విచారణకు సిద్ధపడాలన్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో చంద్రబాబు మేకలకు వేసినట్లు ఎమ్మెల్యేలకు కండువాలు వేస్తున్నారని అంబటి విమర్శించారు.  కాపు రిజర్వేషన్ల విషయంలోను, ఇతర విషయాల్లోను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఎందుకు వెనకాడుతున్నారని అంబటి అధికారపార్టీని ప్రశ్నించారు. మద్రగడ పద్మనాభం ఉద్యమం, మంద కృష్ణమాదిగ పోరాటాల వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందనడం దుర్మార్గమన్నారు. ప్రతి దాని వెనక ఆయన హస్తం ఉందనడం టీడీపీ నేతలకు అలవాటైపోయిందన్నారు. చంద్రబాబు మీరు ఇచ్చిన హామీల గురించి వాళ్లు ఉద్యమిస్తుంటే దాన్ని వైఎస్ జగన్ కు అంటగడుతారా...మీకు బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు.

అసలు చంద్రబాబు లాంటి నాయకుడు ఏపీకి ముఖ్యమంత్రిగా రావడం తెలుగు ప్రజల అదృష్టం అని వెంకయ్యనాయుడు అంటున్నారని, దాన్నిబట్టి చూస్తే చంద్రబాబు విలువలు పెరిగిపోయాయో, వెంకయ్య విలువలు దిగజారిపోయాయో అర్థం కావట్లేదన్నారు. ఈ నీచ వ్యవహారంపై కేంద్రం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచస్థాయి రాజధాని పేరుతో లోకేష్, చంద్రబాబు బినామీ పేర్లతో ప్రపంచస్థాయి దోపిడీ జరుపుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలే చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారన్నారు. 
Back to Top