బాబు గొప్పలతో కేంద్ర సాయం రావట్లేదు



ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎలాంటి ప్రయత్నం చేయలేదు
– నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు చెప్పిన మాటల్లోనే తేటతెల్లం
– విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే
– ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు
– ప్రత్యేక హోదా కోసం పోరాటం చేద్దాం
హైదరాబాద్‌: అంకెల గారడీతో చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని, ఆయన గొప్పలతో కేంద్రం నుంచి రావాల్సిన సాయం రావట్లేదు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని, ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఇంతవరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడి మాటల ద్వారా తేటతెల్లం అవుతుందన్నారు. మూడున్నరేళ్ల తరువాత ఇవాళ చంద్రబాబు విభజన చట్టంలోని అంశాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌లో హామీ ఇచ్చారని నాడు బీజేపీ ఎంపీగా ఉన్న వెంకయ్య నాయుడు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేశారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని కోరినట్లు గుర్తు చేశారు.  విభజన చట్టాలను తూచా తప్పకుండా అమలు చేయాలని ఏపీ ప్రజలు కోరుతున్నారని, అయితే ఇప్పటి వరకు ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. ఇవాళ చంద్రబాబు విచిత్రంగా కామెంట్‌ చేశారు. విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చకపోతే మేం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ఇలాంటి కామెంట్‌ చేశారని విమర్శించారు. చంద్రబాబు కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారని, ఏపీని టీడీపీ, బీజేపీలు కలిసి పాలిస్తున్నాయన్నారు. దీనికి బాధ్యత చంద్రబాబే అన్నారు. చంద్రబాబు, మోడీ ఇద్దరూ కలిసి విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉందన్నారు. మూడున్నరేళ్ల తరువాత చివర్లో కోర్టుకు వెళ్తామని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. కేంద్రం నుంచి సాధించలేక న్యాయస్థానానికి వెళ్తామని చెప్పడం మీ విఫల్యమే అన్నారు. కేంద్రం తన బాధ్యత నెరవేర్చనప్పుడు మీరు కేంద్రం నుంచి బయటకు రావాలి తప్ప.. ఏపీ ప్రజానీకాన్ని తప్పుడు మార్గంలో మళ్లించే మాటలు మాట్లాడటం సరికాదన్నారు.

నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడి మాటల్లో తేటతెల్లం
 నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు నిన్న సీఎంతో కలిసి సమావేశంలో పాల్గొన్నారని, ఆ సమావేశంలో ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆయన మాటల ద్వారా తేటతెల్లమైనట్లు అంబటి రాంబాబు తెలిపారు. తలసరి ఆదాయంలో కేంద్రంతో సగటుగా ఉన్న రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరమా అన్నారని చెప్పారు. అంటే కేంద్రానికి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు ఏవిధమైన ప్రయత్నం చేయలేదని నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవతుందన్నారు. 

వైయస్‌ జగన్‌ ముందు నుంచే హెచ్చరించారు
చంద్రబాబు జీడీపీ పెంచి చూపుతున్నారని, ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం అప్పులు తెచ్చుకునేందుకు నిజం కాకపోయినా మన ఆదాయాన్ని పెంచి చూపుతున్నారని అనేక సందర్భాల్లో వైయస్‌ జగన్‌ హెచ్చరించారన్నారు. అంకెల గారడీ చేసి జీడీపీ పెంచడంతో అసలుకే మోసం వచ్చిందన్నారు.  ఈ నెల 12న మోడీకి చంద్రబాబు ఓ విజన్‌ డాక్యుమెంటరీ ఇచ్చారని, అందులో రెండంకెల గ్రోత్‌ను చేరుకున్నామని, అయితే అందరి కన్న తక్కువగా ఉన్నామని చెప్పినట్లు గుర్తు చేశారు. రాష్ట్రం వృద్ధి రేటు 24.44 ఉందని మోడీకి చెప్పినట్లు తెలిపారు. అంటే కేంద్రంలో 2 శాతం ఉంటే  ఇక్కడ 24 శాతమని చెప్పారు.  కేంద్రంలో 5 శాతం మొత్తం వృద్ధి రేటు ఉంటే ఏపీలో 12 శాతం ఉన్నామని గొప్పలు చెప్పుకున్నారని, మోడీ వద్దకే వెళ్లేసరికి అందరి కన్న తక్కువగా ఉన్నామని చెప్పడంలో ఆంతర్యం ఏంటో చెప్పాలన్నారు. ఈ రోజుకు కూడా ప్రత్యేక హోదాపై ప్రతిపాదనలు చేస్తే పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు చెప్పడం వాస్తవమన్నారు.  2022 నాటికి దేశంలోని టాప్‌ మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ ఉంటుందన్నారు. 2029 నాటికి దేశంలో ఏపీ నెంబర్‌ వన్‌గా ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. గొప్పలు చెప్పుకునే క్రమంలో కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని మనం పోగొట్టుకుంటున్నామన్నారు. 

ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు..
నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ..హైదరాబాద్‌కు వస్తున్న ఆదాయం 40 శాతం ఏపీ ప్రజల నుంచి వస్తుందని, వీరందరూ తిరిగి ఏపీకి వస్తే మీరు కూడా బాగుపడుతారని ఆయన పేర్కొన్నారు. ఆది ఆశ్చర్యకరమన్నారు.  ఉమ్మడి రాజధాని కావడంతో ఉద్యోగాలు, ఉపాధి అక్కడే దొరుకుతుందని, వారు చెల్లించే పన్నులు 40 శాతం దక్కుతుందన్నారు. ఈ ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని, చంద్రబాబు మాత్రం ఓటుకు కోట్లు కేసులో చిక్కుకోవడంతో అమరావతికి వెళ్లారన్నారు. ఏపీ అభివృద్ధి చెందిన రోజు అన్ని రాష్ట్రాల నుంచి వస్తారని, ఆ రకంగా అభివృద్ధి చెందకపోగా, దిగజారిపోయిందని నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు పేర్కొన్నారన్నారు. ప్రభుత్వం నుంచి అభ్యర్థన వస్తే పరిశీలిస్తామని నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు చంద్రబాబు పక్కనే కూర్చుని చెప్పారన్నారు. ఈ క్రమంలో మనమందరం కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వంగవీటి రాధా పై మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ కూడా అవాస్తవమని అంబటి రాంబాబు కొట్టిపారేశారు.
 
Back to Top