అబద్ధాల సబ్బం హరి: ఆదిరెడ్డి ఆగ్రహం

హైదరాబాద్ :

వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ, పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి విషయంలో ఎంపీ సబ్బం హరి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తీవ్రంగా ఖండించారు. ఆయన చెప్పిన అంశాలకు ఎలాంటి ఆధారాలూ లేవని హరి తనకు తానే చెప్పుకున్న వైనాన్ని ప్రస్తావించారు. సబ్బం హరి చేసిన విమర్శలను గురువారం ఒక ప్రకటనలో ఆయన తిప్పికొట్టారు. హరి వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే కాంగ్రెస్ పార్టీ దిగజారుడు డ్రామాలో మరో అంక‌ం అనే విషయం స్పష్టం అవుతుందని ఆదిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకంలో ‌హరి పావుగా ఉపయోగపడుతున్నారనే విషయూన్ని చెప్పకనే చెప్పారన్నారు.

సబ్బం హరి ఏనాడూ వైయస్ఆర్‌సీపీలో ప్రాథమిక సభ్యుడు కూడా కాదని ఆదిరెడ్డి గుర్తుచేశారు. అలాంటి హరి సలహాదారును అని చెప్పుకోవడం ఆత్మవంచనే అన్నారు. ఒక వంక ఏఐసీసీ నుంచి తనకు ఆహ్వానం అందలేదంటూనే, అదే ఏఐసీసీ డ్రామాలో భాగంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డిని, వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీని విమర్శించేందుకు నానా పాట్లూ పడ్డారని ఎద్దేవాచేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్న కాంగ్రె‌స్‌లోనే కొనసాగడమే కాకుండా.. ఆ పార్టీ ఆడిస్తున్న వీధినాటకాల్లో తానెంతటి నీచ పాత్ర అయినా పోషిస్తానని అధిష్టానానికి సంకేతాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. యెల్లో మీడియాలోని ఒక తోకపత్రిక తన ఆత్మానందం కోసం పుట్టించుకున్న ఓ సర్వే అనే బిడ్డను సబ్బం తన భుజాలకు ఎత్తుకుని మోశారని విమర్శించారు.

కాంగ్రెస్, దాని అనుబంధ పార్టీ టీడీపీ, సబ్బం హరి చేరాలనుకుంటున్న సీఎం పార్టీల సత్తా ఏమిటో, ఆయనకు జనంలో ఉన్న ఇమేజీ ఏమిటో మరో నాలుగు నెలల్లో తేలిపోతుందని ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. రామోజీ పత్రికను మత గ్రంథాలతో పోల్చడం ద్వారా రామోజీరావే తనకు దేవుడని సబ్బం చెప్పకనే చెప్పుకున్నారని విమర్శించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ నినాదం కాదని.. విధానమని స్పష్టం చేశారు. వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలకు అసంతృప్తి ఉండే అవకాశం లేనేలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రేలాపనలు కట్టిపెట్టాలని సబ్బం హరిని అప్పారావు హెచ్చరించారు.

Back to Top