వైయ‌స్ఆర్‌సీపీ వర్గీయులపై దాడికియత్నం

నరసరావుపేట : గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని కేసానుపల్లిలో టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. వైయ‌స్ఆర్‌సీపీ వర్గీయులపై దాడికి యత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా మెయిన్‌ రోడ్డుపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నించిన పంచాయతీ కార్యదర్శిపై బెదిరింపులకు దిగారు.  వివరాల్లోకి వెళ్తే.. రెండురోజుల కిందట గ్రామంలోని మెయిన్‌రోడ్డులో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. దీంతో టీడీపీ వర్గీయులు గ్రామంలో బెదిరింపులకు దిగారు.

గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శి తన సిబ్బందికి సూచించారు. వాటిని తొలగించేందుకు ప్రయత్నించగా టీడీపీ వర్గీయులు వచ్చి.. తాము ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీని తొలగిస్తే చేతులు నరికేస్తామంటూ వీరంగం వేశారు. గ్రామ సచివాలయం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ వర్గీయులపై దాడికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్‌ఐ బాలనాగిరెడ్డి గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను పంపించి వేశారు. ఫ్లెక్సీలను పోలీసులు తొలగించి.. గ్రామంలో పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. 

Back to Top