దిశ యాప్‌ వినియోగంపై స్పెషల్‌ డ్రైవ్ 

రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత 

తాడేపల్లి: దిశ యాప్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారని హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత తెలిపారు. ప్రతి ఇంటిలోని మహిళలకు ఈ యాప్ పై అవగాహన వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించార‌ని చెప్పారు. మహిళల భద్రత కోసం మరింత పకడ్బందీగా వ్యవహరించాలని సీఎం వైయ‌స్ జగన్ ఆదేశించినట్లు సుచరిత పేర్కొన్నారు. మహిళల భద్రతపై సీఎం వైయ‌స్‌ జగన్‌ అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడారు. 

దిశ యాప్‌ను వలంటీర్లు, మహిళా పోలీసులు వినియోగించుకోవాలని సూచించారు. కాలేజీలు, స్కూళ్లు తెరిచిన తర్వాత విద్యార్థినులకు దిశా యాప్ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు.పెట్రోలింగ్ వాహనాలను, సీసీ కెమెరాలను అవసరమైన చోట పెంచాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు.

సీతానగరం ఘటనలో అనుమానితులను గుర్తించామని... త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు. నిర్మానుష్యప్రాంతంలో జరగడంతో అనుమానితులను గుర్తించడం కష్టంగా మారింది. అయినా బాధితురాలి సహకారంతో  పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారని మంత్రి వెల్లడించారు.

Back to Top