సింగపూరు పట్నం చూడర బాబూ

అమరావతి ఎలా ఉంటుందో సాంపిల్ చూపించడం కోసం రాజధాని రైతులను సింగపూరు పంపుతున్నాడు చంద్రబాబు. లాటరీలో వందమంది రైతులు సింగపూరు ప్రయాణానికి ఎంపికయ్యారు. ఇక మిగిలిన కొద్దిమందిని మాత్రం నిరాశ పరచడం ఎందుకు అంటూ ఉదారంగా వారినీ సింగపూరు ఫ్లైటు ఎక్కించేయమన్నాడు. ఇక రైతులను తలపాగా తీసేసి టోపి పెట్టుకోమన్నాడు. పంచ ఊడపీకి సూటు బూటు వేయించాడు. మీసాలూ, గెడ్డాలూ గీయించేసి దొరల దేశం పద్ధతుల్లో తయారు కమ్మన్నాడు. సింగపూరు సిటీ చూసి ఆ కళ్లతో వచ్చి అమరావతిని చూడమన్నాడు. రాబోయే రోజుల్లో అలాంటి రాజధాని మనకూ రాబోతోందని అర్థం చేసుకోమన్నాడు. తిరిగి రాగానే రాజధాని రైతులందరూ వ్యవసాయం అనే మాటను మర్చిపోయి రాజధానిలో వాణిజ్యం చేసే స్థాయికి చేరుకుంటారు కనుక, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయమని సిబ్బందిని ఆదేశించాడు. సింగపూర్ బిజినెస్ మేన్లలా రాజధాని రైతులు తయారవ్వాలని సూచనలిచ్చాడు. అంతా సిద్ధమయ్యారు. సింగపూరు చేరుకున్నారు. ఆర్చర్డ్ రోడ్ లో బహుళంతస్థుల భవనాలు చూసి ఆహా అనుకున్నారు. సెంటోసా ద్పీపం చూసి ఓహో అనుకున్నారు. టైగర్ స్కై టవర్ చూసి అబ్బురపడ్డారు. కాసినోలను చూడగానే రైతుల కళ్లు తిరిగాయి. యాత్రపూర్తయింది. తిరిగి అమరాతికి చేరుకున్నారు రైతులందరూ. విమానం దిగగానే రైతులందరికీ రంగురంగుల కళ్లజోళ్లు అందించారు అధికారులు. ఇవి పెట్టుకోండి అన్నారు. ఎందుకివి అడిగారు రైతులు. సింగపూరు తర్వాత అంత గొప్ప రాజధాని అమరావతిని చూడటానికి అన్నారు. బలవంతంగా అందరి కళ్లకూ కళ్లజోళ్లు పెట్టి, ఎయిర్ పోర్టు నుంచి బయటకు తీసుకొచ్చారు. అంతే ముందంతా పెద్ద పెద్ద భవంతులు అచ్చం సింగపూర్ లో చూసినట్టే, ఫౌంటేన్లు, రోడ్లు అన్నీ సింగపూర్ లో ఉన్నట్టే ఉన్నాయి. పార్కులు, గార్డెన్లు, పెద్దపెద్ద కార్లు, అధునాతన వాహనాలూ అన్నీకళ్లముందు నుంచి కదులుతూ వెళ్తున్నాయి. అరే మనం సింగపూర్ చూసొచ్చేసరికి మన ముఖ్యమంత్రి ఇక్కడ అమరావతిని కట్టేసారు బాగుందే అనుకున్నారు రైతులు. దిగండి మీరు దిగాల్సిన ప్లేసు వచ్చింది అని బస్సులోంచి దింపి వెళ్లిపోయారు అధికారులు. ఆహా మన రాజధాని అద్భుతంగా ఉంది అనుకుంటూ కళ్లజోళ్లు తీసారు రైతులు. ఎదురుగా బీళ్లుపడి, కంచెలేసిన తమ చేలు కనిపిచాయి. కళ్లు తిరిగి పడిపోయారు వాళ్లు. 

తాజా వీడియోలు

Back to Top