అర‌చేతిలో అమ‌రావ‌తి

"రెండేళ్ల పాల‌న‌లో మీరేం చేశారు?"  చంద్ర‌బాబుని విలేక‌రులు అడిగారు.
"తెల్ల‌వారు జామున నిద్ర‌లేచాను. ఐదు గంట‌ల‌కి మంచి ముహుర్త‌మ‌ని చెప్పారు. అమ‌రావ‌తి వైపు తిరిగి పూజ చేసాను. ఏడు గంట‌ల‌కి కొబ్బ‌రికాయ కొట్టాను. తొమ్మిది గంట‌ల‌కి టిఫిన్ చేసి, సరిగ్గా ఒంటి గంట‌కి లంచ్ చేసాను. నాలుగుకి టీ, రాత్రి తొమ్మిదికి భోజ‌నం"చెప్పారు బాబు.
"మేమ‌డిగింది మీ దిన‌చ‌ర్య గురించి కాదు, ప్ర‌జ‌ల‌కి మీరేం చేశార‌ని?"  
"ప్ర‌జ‌ల కోసం సింగ‌పూర్‌, ఢిల్లీకి విమాన ప్ర‌యాణం చేశాను. రాజ‌ధానికి మ్యాప్ కూడా గాలిలోనే త‌యారు చేయించాను. దీని ప్ర‌కారం రాజ‌ధాని నిర్మాణం పూర్త‌యితే అన్ని స‌మ‌స్య‌లు తీరిపోతాయి.
"మేమ‌డిగిన ప్ర‌శ్న మీక‌ర్థం కాలేదు"
"ప్ర‌జ‌లంటే ఎవ‌రు?  ప్ర‌భుత్వ‌మే కదా, గ‌వ‌ర్న‌మెంట్ రోడ్డుపై పాల‌న చేయ‌లేదు క‌దా, దానికో రాజ‌ధానుండాలి, బిల్డింగ్‌లుండాలి, ఎసిలుండాలి సంత‌కాలు చేయ‌డానికి పెన్నులుండాలి.
అమ‌రావ‌తి చుట్టూ రోడ్లు వేయిస్తాం. త‌రువాత భూగ‌ర్భ డ్రైనేజీ ప‌థ‌కం తెచ్చి అన్ని రోడ్లు త‌వ్వేస్తాం. మ‌ళ్లీ వేస్తాం. ఆ త‌రువాత మెట్రోప్రాజెక్ట్ తెస్తాం. రోడ్డుకి అటు ఇటు కాకుండా న‌డిమ‌ధ్య‌లో త‌వ్వుతాం. ఈ త‌వ్వ‌కాల్లో కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ మూడేళ్ల పాటు అమ‌రావ‌తిని లేపుతూనే వుంటాం."
"మీద‌గ్గ‌ర అన్ని రోగాల‌కీ ఒక‌టే మందు వున్న‌ట్టుంది"
"అంతా బాగానే ఉంది కానీ, ఈలోగా ప్రభుత్వం దగ్గర డ‌బ్బులు ఖాళీ అయ్యేలా వున్నాయి"
"ఇంత‌ కాలానికి రియాల‌టి గుర్తించారు. మీడియా ఫోర్త్ ఎస్టేట‌యితే మా ప్ర‌భుత్వం ది రియ‌ల్ ఎస్టేట్‌. రెండేళ్ల నుంచి మేము భూసేక‌ర‌ణ‌, కొనుగోలు అమ్మ‌కాల్లో బిజీగా వున్నాం. దీప‌ముండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాలి"

"ఈ రెండేళ్ల‌లో మీరేం సాధించారు?"
"ప్ర‌త్యేక విమానంలో వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో చ‌ర్చ‌లు సాగించాం. వీలైనంత వ‌ర‌కూ రైతుల భూమిని లాక్కున్నాం. రియ‌ల్ ఎస్టేట్ డ‌బ్బుల‌తో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల్ని కొనుక్కున్నాం. మంత్రుల‌కి మార్కులేశాం. ప్ర‌జ‌ల‌కి టోపీ పెట్టాం"
"మిగిలిన మూడేళ్లు ఏం చేస్తారు?"
"వాస్తు పండుతుల్ని పిలిపించి అమ‌రావ‌తికి వాస్తు వుందో లేదో చెక్ చేయిస్తాం. ఒక‌వేళ లేద‌ని తేలితే క‌డుతున్న వాటిని కూల్చేసి మ‌ళ్లీ క‌డ‌తాం. అమ‌రావ‌తికి దిష్టి త‌గ‌ల‌కుండా ప్ర‌తి ఇంటిముందు గుమ్మ‌డికాయ‌ల్ని క‌ట్టాల‌ని పిలుపునిస్తాం. ఆ విధంగా గుమ్మ‌డి రైతులు బాగుప‌డ‌తారు. మావాళ్లేవ‌రైనా త‌ప్పు చేస్తే ట‌మోటాలు, కోడిగుడ్ల‌తో కొట్టాల‌ని ప్ర‌జ‌ల‌కు చెబుదాం. ఈ చ‌ర్య‌వ‌ల్ల ట‌మోట‌, పౌల్ట్రీరైతులు బాగుప‌డ‌లేరు. ఇంటింటికి ఇంట‌ర్‌నెట్ ఇవ్వ‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు క‌ష్టాల్ని మ‌ర‌చిపోయి సినిమాలు చూసుకుంటారు. ఎలాగూ మేము వేసే కేబుల్ నాసిర‌కంది కాబ‌ట్టి కంప్యూట‌ర్ మెకానిక్‌ల‌కు ప‌ని పెరుగుతుంది. ఏదోర‌క‌మైన ప‌నికిమాలిన ప‌నులు చేసి ప‌ని క‌ల్పించ‌డ‌మే మా బాధ్య‌త"‌ అన్నారు బాబు.
"మీరు మాములోళ్లు కాదు, స‌ముద్రానికే ఉప్పుని అమ్మ‌గ‌ల మ‌హానుభావులు "అని విలేక‌రులు వెళ్లిపోయారు.

తాజా వీడియోలు

Back to Top