మహిళలంటే కనీస గౌరవం లేని కూటమి ప్రభుత్వం
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు అధికార మదంతో మహిళలను అవమానించడం అలవాటుగా మారిందని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... 16 నెలల పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళల పట్ల కాలకేయుల్లా మారారని, ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ మహిళా నేత కృపాలక్ష్మిపై అత్యంత నీచంగా మాట్లాడిన ఎమ్మెల్యే థామస్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని, సీఎం చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంకా ఆమె ఏమన్నారంటే...
● తెలుగు దురంహకార పార్టీ ఇది...
టీడీపీ అంటే తెలుగు దురహంకార పార్టీగా మార్చేశారు. ఎంత మంది మహిళలను వేధించినా, అవమానించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల మద్దతు ఉంటుందన్న ధైర్యంతో సభ్యత, సంస్కారం మరిచి ప్రవర్తిస్తున్నారు. వైయస్ఆర్సీపీ జీ డీ నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మిపై ఎమ్మెల్యే థామస్ అత్యంత సంస్కారహీనంగా మాట్లాడారు. ఒక దళిత మహిళపై ఇంత నీచంగా ఎమ్మెల్యే ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు. మహిళలపై ఎంత నీచంగా మాట్లాడినా వారి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమీ అనరన్న దైర్యంతోనే ఇలా మాట్లాడుతున్నారు.
ఎమ్మెల్యే ధామస్ ను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీ ఇంట్లో మహిళల గురించి కనీస సభ్యత లేకుండా ఇంత నీచంగా మాట్లాడగలరా ? మీ మహిళల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు మౌనంగా ఉంటారా? అడ్డదారిలో ఈవీఎంల సాయంతో ఎమ్మెల్యే అయిన థామస్.. లంచం లేనిదే నియోజకవర్గ ప్రజలకు ఏ పని చేయరని చెప్పుకుంటున్నారు. దేవుడి అంటే కూడా ఆయనకు లెక్కలేదు. అలాంటి వ్యక్తి మహిళలకు గౌరవం ఇస్తాడని ఆశించడం లేదు. జీ డీ నెల్లూరు వైయస్ఆర్సీపీ నేత కృపాలక్ష్మికి ఎమ్మెల్యే థామస్ కచ్చితంగా క్షమాపణ చెప్పాలని, ఇంత దారుణంగా మహిళ మీద దుర్భాషలాడిన అతని మీద చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే థామస్ వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్ తో పాటు, ఎస్సీ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నాం.
● మహిళలంటే గౌరవం లేని అధికార పార్టీ ప్రతినిధులు...
తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ నేతలకు మహిళలంటే కనీస గౌరవం లేదు. చంద్రబాబు నాయుడు ప్రోత్సాహమే ఇందుకు కారణం. ఆ ధైర్యం తోనే ఇలా దిగజారి ప్రవర్తిస్తున్నాను. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఏకంగా నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న మహిళపై ఇంత దిగజారి మాట్లాడ్డం దారుణం. కృపాలక్ష్మి మాటల్లో ఏం తప్పు ఉందని ఎమ్మెల్యే దుర్భాషలాడారు.
ములకల చెరువులో మీ పార్టీ నేతలు నకిలీ మద్యం తయారు చేసి అడ్డంగా తయారు చేసిన మాట వాస్తవం కాదా? దానిమీద పోరాటం చేస్తే మీకు ఎందుకు అంత ఉలుకు? కల్తీ మద్యం తయారీలో మీ పార్టీ తంబల్లపల్లె నియోజకవర్గ ఇన్ ఛార్జ్ అడ్డంగా దొరికిన మాట వాస్తవం కాదా? నిజాలను ప్రశ్నిస్తే దాన్ని జీర్ణించుకోలేక వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. టీడీపీ నేతలు కూటమి పాలనలో మహిళల పట్ల కాలకేయుల్లా మారారు. చంద్రబాబు, లోకేష్ లకు అత్యంత సన్నిహితుడైన మరో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి వ్యవహారాన్ని ఇప్పటికే కధలు, కథలుగా చెప్పుకుంటున్నారు. కూటమి భాగస్వామి పార్టీ జనసేన నాయకురాలు కోట వినుత ప్రైవేటు వీడియోలు తీయించడానికి ఆమె డ్రైవరుకు ఏకంగా రూ. 60 లక్షలు ఎర చూపారని ఆమె పలుమార్లు ఆవేదవ వ్యక్తం చేశారు. తాజాగా ఆమె డ్రైవర్ సెల్ఫీ వీడియో ద్వారా మరిన్ని దారుణాలు వెలుగుచూశాయి. కోట వినుతను హత్య చేయడానికి కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్లాన్ చేసిన విషయం కూడా బయటపడింది. ఇవన్నీచూస్తుంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా దిగజారిపోయారో అర్ధం అవుతుంది. ఇలాంటి ఎమ్మెల్యే మీద చంద్రబాబు, లోకేష్ లు ఎందుకు చర్యలు తీసుకోలేదు. చివరకు కూటమి పార్టీలకు చెందిన మహిళా నేతలకే రక్షణ లేకుండా పోయింది.
● కాలకేయుల్లా మారిన కూటమి నేతలు
మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడ్డం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు చాలా కామన్ గా మారింది. గతంలో మాజీ మంత్రి ఆర్కే రోజా పై కూడా... టీడీపీ నేత గాలి భాను ప్రకాష్ రెడ్డి అత్యంత నీచంగా మాట్లాడితే దానిపై పోలీసులుకు ఫిర్యాదు చేసిన స్పందన లేదు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మీద టీడీపీ నేతలు దాడి ఘటనపై ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు తిరిగి ఆమె భర్త మీద కేసు పెట్టారు. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళా ఇక్కడ తనకు రక్షణ లేదని.. పక్కనున్న తెలంగాణా రాష్ట్రంలో మీడియా మందు తన గోడు వెల్లబోసుకుంది. అయినా అతని పై ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వం... పంచాయితీ పెట్టి కేసు వాపసు తీసుకునేలా ఆమెను బెదిరించారు. మరో టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వేధింపుల కారణంగా చిట్టెల వలస గ్రామానికి చెందిన మహిళా వీఆర్వో ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే... దానిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోని చంద్రబాబు పొలిటికల్ పంచాయితీ చేసి నోరు మూయించారు. జనసేన పార్టీకి చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు... పవన్ కళ్యాణ్ కు చెందిన పంచాయతీరాజ్ శాఖలో పీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిని.. ప్రతినెలా మామూళ్లు ఇవ్వాలి లేదంటే పక్కలోకి రావాలని వేధిస్తే ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ వేధింపులు తాళలేక ఆయన కార్యాలయం ముందే... ఆ పార్టీకి చెందిన మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. ఇది కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు.
● సుగాలీ ప్రీతి కుటుంబానికి న్యాయం ఎప్పుడు ?
ఇలాంటి తప్పుడు పనులు చేసిన ఎమ్మెల్యేల మీద చర్యలకు పోలీసులను ఉపయోగించని ప్రభుత్వం.. అమాయకురాలైన సుగాలీ ప్రీతి తల్లిని అరెస్టు చేయడానికి మాత్రం పోలీసులను ఉపయోగిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలలుగా తన కుమార్తెను చంపిన వాళ్లను పట్టుకోవాలని పోరాటం చేస్తుంటే... కనీసం పట్టించుకోలేదు. ఎన్నికల ముందు మాత్రం పవన్ కళ్యాణ్ కర్నూలు వెల్లినప్పుడు సుగాలీ ప్రీతి తల్లిని అడ్డంపెట్టుకుని ఓట్లు అడిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే... సుగాలీ ప్రీతి కేసును సీబీఐతో విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ ఉదయం నుంచి సుగాలీ ప్రీతి తల్లిని అక్రమంగా నిర్భంధించారు. ఈ ప్రభుత్వం మహిళలను అక్రమంగా నిర్భంధించడానికే పోలీసులను వాడుతున్నారే తప్ప... తప్పు చేసిన మీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడం లేదు. సుగాలీ ప్రీతి హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు అయ్యాయని చెబుతున్న పవన్ కళ్యాణ్ గారు.. అసలు హత్య జరిగిందే తెలుగుదేశం పార్టీ, మీరు అధికారంలో ఉన్నప్పుడు కాదా? మరి ఎందుకు సిబీఐ ద్వారా ఈ కేసు దర్యాప్తు చేయించి ఆ తల్లికి న్యాయం చేయడం లేదు? అంటే కేవలం ఎన్నికల్లో లబ్ది కోసమే సుగాలీ ప్రీతి హత్య కేసును వాడుకుని.. అధికారంలోకి రాగానే దాన్ని పట్టించుకోవడం మానేశారు. ఒక మహిళ ఈ రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్నా.. కూటమి పాలనలో మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయింది. ఇన్ని దారుణాలు జరుగుతున్నా... చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? మా పార్టీ నేత కృపాలక్ష్మిపై చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించాలి. తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే థామస్ క్షమాపణలు చెప్పడంతో పాటు, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వరుదు కల్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.