మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేయడమే చంద్రబాబు లక్ష్యం
నంద్యాల: వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని నంద్యాల జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మండిపడ్డారు. పాణ్యం నియోజకవర్గం కల్లూరు 29వ వార్డులో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన "కోటి సంతకాల సేకరణ" కార్యక్రమంలో కాటసాని రామ్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్య, విద్య దూరమవుతుందని అన్నారు. సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారని, అయితే ప్రస్తుత సీఎం చంద్రబాబు వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని మహిళకు ఇచ్చిన హామీలను చేయలేదని విమర్శించారు. ఈనెల 12న నిర్వహించిన ప్రజా ఉద్యమం కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది అని వార్డులో ఇంటింటికి వెళ్లి సంతకాలు స్వీకరిస్తూ ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేటర్లు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.