సివిల్ సప్లయ్ వాహనం దారిమళ్లితే క్షణాల్లో సమాచారం
విజయవాడ: సివిల్ సప్లయ్ వాహనాలకు జియో ట్యాగింగ్ చేస్తామని, దీని ద్వారా వాహనాలను ట్రాక్ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. విజయవాడలో సివిల్ సప్లయ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ధాన్యం సప్లయ్ ఎలా జరుగుతుందో మానిటర్ చేయడానికే కంట్రోల్ రూమ్ ఉపయోగపడుతుందన్నారు. ధాన్యం తరలిస్తున్న వాహనం దారి మళ్లినా క్షణాల్లో కంట్రోల్ రూమ్కు సమాచారం వస్తుందన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా సివిల్ సప్లయ్ వాహనాలను ట్రాక్ చేస్తామని చెప్పారు. రేషన్ బియ్యం, ధాన్య సేకరణ, కార్డుల జారీ తదితర ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తున్నారన్న అంశాలు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం తెలుసుకుని దానికి తగిన విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. సివిల్ సప్లయ్ అప్పులు పెరగడానికి చంద్రబాబే కారణమని మంత్రి కారుమూరి తెలిపారు.